కడప ముగ్గురాళ్ళ మైనింగ్ కేసులో వైఎస్ ప్రతాపరెడ్డి అరెస్టు

బుధవారం, 12 మే 2021 (08:35 IST)
కడప జిల్లాలో మామిళ్లపల్లి ముగ్గురాళ్ల మైనింగ్‌ పేలుడుకు సంబంధించి ఎక్స్‌ప్లోజివ్‌ లైసెన్సుదారుడు వైఎస్‌ ప్రతాపరెడ్డిని మంగళవారం అరెస్టు చేశారు. ఈయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు. కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి స్వయానా పెదనాన్న. 
 
వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య సతీమణి కస్తూరిబాయి పేరుతో 2001 నవంబరులో మామి ళ్లపల్లిలో మైనింగ్‌ లీజు జారీ కాగా... నిర్వహణ హక్కులను బి.మఠం మండలానికి చెందిన వైసీపీ నేత నాగేశ్వర్‌ రెడ్డికి 2013లో జీపీఏ (జనరల్ ఆఫ్ అటార్నీ) ఇచ్చారు. 
 
ప్రస్తుతం ఆయనే మైనింగ్‌ నిర్వహిస్తున్నారు. నిబంధనలకు తూట్లు పొడిచి భూగర్భ బెరైటీస్‌ మైనింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఈ నెల 8న పులివెందుల నుంచి పేలుళ్ల కోసం జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లను తీసుకొచ్చి దింపుతుండగా జరిగిన పేలుడులో 10 మంది మృతిచెందారు. 
 
ఈ పేలుడు పదార్థాలు వైఎస్‌ ప్రతాప్ రెడ్డి మ్యాగజైన్‌ నుంచి రవాణా చేసినట్లు కడప ఎస్సీ, ఎస్టీ విభాగం డీఎస్పీ సుధాకర్‌ తెలిపారు. ‘ఈయనకు పేలుడు పదార్థాల అమ్మకాలు, నిల్వ చేసే మ్యాగజైన్లు, రవాణా లైసెన్సులు ఉన్నాయి. ఈయన పులివెందులకు చెందిన యర్రగుడి రఘునాథరెడ్డికి పేలుడు పదార్థాలు, రెండు మ్యాగజైన్లలో భద్రపరుచుకోవడానికే అగ్రిమెంటు ఇచ్చారు. 
 
ప్రతాప్ రెడ్డికి చెందిన లైసెన్సు మ్యాగజైన్లలో పేలుడు పదార్థాలు, జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లను అధిక లాభానికి లైసెన్సు లేనివారికి రఘునాథ రెడ్డి అక్రమంగా విక్రయిస్తూ వస్తున్నారు. 8న ఎక్స్‌ప్లోజివ్‌ రూల్స్‌కు విరుద్ధంగా లైసెన్సు లేని లక్ష్మిరెడ్డికి జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లను రఘునాథరెడ్డి అక్రమంగా విక్రయించారు. వాటిని కలసపాడు మండలం, పోరుమామిళ్ల సమీపంలోని కొండగంగమ్మ మైనింగ్‌కు ఎలాంటి భద్రత లేని కారులో తీసుకొని వెళ్లి దించుతుండగా ఈ పేలుళ్లు జరిగాయి’ అని వివరించారు.
 
వైఎస్‌ ప్రతాప్ రెడ్డి ఎక్స్‌ప్లోజివ్‌ రూల్స్‌కు విరుద్ధంగా లైసెన్సు లేని వారికి పేలుడు పదార్థాలు విక్రయించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న ప్రతాప్ రెడ్డిని మంగళవారం అరెస్టు చేశామని తెలిపారు. ఈ కేసులో సోమవారం అరెస్టు చేసిన నాగేశ్వర్‌రెడ్డి, రఘునాథ రెడ్డిలకు 14 రోజులు రిమాండుకు కోర్టు ఆదేశించినట్లు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు