తన ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి వద్ద ట్యాప్ అయిన తన ఆడియో ఉందని ఇది నిజమో కాదో వైపీ సుబ్బారెడ్డి అతని కుటుంబ సభ్యులు మీద ప్రమాణం చేసి నిజం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వైవీ చేతికి ఆ ఆడియో ఎలా వచ్చిందో విచారణకు పిలిచి ప్రశ్నించాలని, ట్యాపింగ్లో నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ఇక జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉందన్నారు.
'కేసీఆర్, జగన్లు కలిసి ఆ నాడు నీచ రాజకీయాలు చేశారు. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదని నాపై నిఘా పెట్టారు. నేను ఎవరిని కలుస్తున్నానో గ్రహించి నాకు మద్దతు ఇవ్వకుండా పెద్ద పెద్ద నాయకులను ఆపేశారు. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ చేసి జరిపిన కుట్రనే. సుబ్బారెడ్డి చేతిలో నా ఆడియో ఉంది. స్వయంగా నేనే విన్నా. ఆస్తుల విషయంలో కుట్రలు పన్ని సుబ్బారెడ్డితో జగన్ అబద్దాలు చెప్పించారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో విచారణ జరుగుతోంది. చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని అన్నారు.
జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది. ఇంత చేసిన జగన్కు ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు అంటే ఎలా? దొంగలు ఎక్కడైనా దొంగతనం చేశామని అంగీకరిస్తారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో సుబ్బారెడ్డిని కూడా పిలిచి విచారణ జరపాలి. ఫోన్ ట్యాపింగ్ నా వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుంది. నా ఫోన్ మాత్రమే అని భావించాను. వందల మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఇపుడే తెలుస్తోంది. అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను' అని వైఎస్ షర్మిల అన్నారు.