తూచ్... రిషికొండపై కడుతున్నది సచివాలయం కాదు... వైకాపా ట్వీట్

ఆదివారం, 13 ఆగస్టు 2023 (15:25 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు... ఆ పార్టీ నేతలు కూడా మాట తప్పుతారని నిరూపించారు. రిషికొండపై సచివాలయం నిర్మిస్తున్నట్టు శనివారం వైకాపా ట్వీట్ చేసింది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో వైకాపా మాట మార్చింది. అక్కడ నిర్మిస్తున్నది సచివాలయం కాదంటూ ఆదివారం ట్వీట్ చేసింది. కేవలం ప్రభుత్వ నిర్మాణాలు మాత్రమే చేపడుతున్నట్టు పేర్కొంది. 
 
"ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు విశాఖను పరిపాలనా రాజధానిగా వైఎస్ జగన్ ప్రకటించారు. రిషికొండపై సచివాలయం నిర్మాణం చేపడుతున్నారు" అంటూ ఓ ట్వీట్ చేసింది. అయితే, ఆ తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించింది. ఈ ట్వీట్ స్క్రీన్ షాట్‌ను టీడీపీ షేర్ చేసి ఎందుకు తొలగించారు బుజ్జికన్నా అంటూ ప్రశ్నించింది. 
 
దీనిపై వైకాపా స్పందించింది. "మా అధికార ట్విటర్ ఖాతాలో రిషికొండపై సచివాలయం నిర్మాణాలు జరుగుగుతున్నట్టుగా శనివారం చేసిన ట్వీట్ పొరపాటు పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణనలోకి తీసుకోగలరు" అని వివరణ ఇచ్చింది. 
 
"మానవ తప్పిదాలు అనేవి సహజంగానే జరుగుతుంటాయి. అలాగే, ఇది కూడా జరిగింది. దానిపై ప్రజలకు తిరిగి వివరణ ఇవ్వడం జరిగింది. ఒక తప్పిదం జరిగే అది జరిగింది అని ఒప్పుకుని దానిని ప్రజలకు వివరించి చెప్పే దమ్ము మాకు ఉంది" అని వివరణ ఇచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు