జగన్ వల్ల మన కళ్లు మనమే పొడుచుకున్నట్లు వుంది... కళా కామెంట్

మంగళవారం, 24 జులై 2018 (19:44 IST)
అమరావతి : వైఎస్ఆర్ సిపి నిర్వహించిన ఏపీ బంద్ విఫలమైందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకటరావు తెలిపారు. ప్రజామోదం లేకుంటే ఎటువంటి పోరాటాలైనా విఫలమవుతాయనడానికి వైసీపీ బందే ఉదాహరణ అని అన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిన కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీని నిలదీయకుండా, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోడానికి వైసీపీ కుట్ర పన్నిందని మంత్రి కళా వెంకటరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘జగన్ తీరు వల్ల మన కళ్లు మనమే పొడుచుకున్నట్లు ఉందని’ అని అన్నారు. 
 
బీజేపీతో కుమ్మకై రెండంకెల వృద్ధి సాధిస్తున్న ఏపీని భ్రష్టుపట్టించాలను అనుకుంటున్నారా..? అని జగన్‌ను ప్రశ్నించారు. ఇష్టానుసారంగా, సమయం సందర్భమూ లేకుండా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజలు హర్షించరన్నారు. ప్రజల మద్దతు ఉన్నప్పుడే బంద్‌లు, ఆందోళన కార్యక్రమాలు విజయవంతమవుతాయన్నారు. వైసీపీ నిర్వహించిన బంద్‌కు ప్రజల నుంచి స్పందన కరవైందన్నారు. రాష్ట్రంలో మిగిలిన పార్టీలు కూడా సహకరించలేదన్నారు. దీంతో ఆ పార్టీ బస్టాండులకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. బంద్ పార్టీ కార్యక్రమంగా నిర్వహించడంతో విఫలమైందన్నారు. జగన్‌కు రాజకీయ పరిపక్వత లేదన్నారు. స్వలాభం కోసం పార్టీలు నడిపితే ఎటువంటి ప్రయోజనం ఉండదనే విషయం వైసీపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. 
 
ఇటీవల లోక్‌సభలో అవిశ్వాసం పెట్టిన సందర్భంలోనూ ఆ పార్టీ నేతలు ఢిల్లీలో అభాసుపాలయ్యారన్నారు. అవిశ్వాసానికి ఎవరూ మద్దతు తెలపలేదంటూ ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం పెట్టాలనుకున్నారు. మీడియా నుంచి ఎటువంటి సహకారమూ లేకపోవడంతో ఆ సమావేశానికి వైసీపీ నేతలు రద్దు చేసుకున్నారు. బంద్ వల్ల మంగళవారం జరగాల్సిన పరీక్ష వాయిదాపడటంతో మెడికల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఇష్టారాజ్యంగా బంద్‌లు నిర్వహించడం వల్ల రాష్ట్రంపైనా, ప్రజలపైనా తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు. వ్యాపార ఉత్పత్తులు, రవాణాసేవలు, దూరప్రాంతం సరుకు తీసుకెళ్ళే వాహనాల ద్వారా ప్రతి రోజూ రూ.115 కోట్ల వరకూ ఆదాయం రాష్ట్రానికి వస్తుందని మంత్రి కళా వెంకటరావు తెలిపారు. 
 
ఒకరోజు బంద్ వల్ల ఆదాయం నష్టపోయే ప్రమాదముందన్నారు. పన్నులు చెల్లించేవారి నుంచి రూ.700 కోట్ల విలువైన ఉత్పత్తుల నిలిచిపోతాయన్నారు. దీనివల్ల కార్మికులు, రోజువారీ కూలీలు, ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎంతో నష్టపోతారన్నారు. ఈ నష్టం ఎవరు భరిస్తారని మంత్రి ప్రశ్నించారు. ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా రోజూ రూ.13 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. బంద్ కారణంగా ఈ నష్టాన్ని భరించే స్థితిలో ఆర్టీసీ లేదన్నారు. ధైర్యం చేసి బస్సులు నడిపినా 30 నుండి 40 శాతం బస్సులను మాత్రమే నడపగలమన్నారు. మిగిలిన బస్సులు తిరగకపోవడం వల్ల రూ.8 కోట్ల వరకూ నష్టం వస్తుందన్నారు. ఆక్వా ఉత్పత్తులలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఈ రంగ ద్వారా ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యం లభిస్తోందన్నారు. బంద్ కారణంగా అమెరికా, యూరప్ మార్కెట్లకు సకాలంలో ఆక్వా ఉత్పత్తులు తరలించకపోతే పాడైపోయే ప్రమాదముందన్నారు. దీనివల్ల ఆక్వారైతులపై పెను ఆర్థికభారం పడుతుందన్నారు. కేంద్రం లాగే వైసీపీ కూడా రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.  ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాలని, లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతున్నారని మంత్రి కళా వెంకటరావు హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు