ప్రశాంతంగా ఉన్న గన్నవరంలో అలజడిరేపిన వల్లభనేని... వైకాపా సూసైడ్ అటెంప్ట్!

మంగళవారం, 15 డిశెంబరు 2020 (15:46 IST)
కృష్ణా జిల్లా గన్నవరంలో ఇపుడు అలజడి చెలరేగింది. ఈ అలజడి గన్నవరం పట్టణంలో మాత్రం కాదు. ఆ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ ఆ తర్వాత వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి వైకాపాలో ఏదో ఒక ప్రాంతంలో అలజడి చెలరేగుతూనేవుంది. 
 
వల్లభనేని వంశీ రాకను స్థానిక వైకాపా నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2019లో వైసీపీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావుకు, వంశీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది.
 
వైసీపీ నేత మొగిలిచర్ల జోజిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన వైసీపీ శ్రేణులు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వంశీపై జోజిబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీ, ఆయన అనుచరుడు కోట్లు ఇద్దరూ కలిసి దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. దళితులకు రావాల్సిన టెండర్లను కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టుల కోసం వైసీపీని వల్లభనేని వంశీ నాశనం చేస్తున్నారని... వీరిపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు