ముంబై నటిపై సజ్జన్ జిందాల్ అత్యాచారం? సెటిల్ చేసిన వైకాపా పెద్దలు!

ఠాగూర్

బుధవారం, 28 ఆగస్టు 2024 (12:10 IST)
ముంబైకు చెందిన ఓ సినీ నటిపై జేఎస్‌డబ్ల్యూ సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్ ప్రేమ పేరుతో లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ నటి ఆయనపై ముంబైలో అత్యాచారం కేసు పెట్టింది. దీంతో దిక్కుతోచని సజ్జన్ జిందాల్... ఐదేళ్లపాటు అరాచకాలకు కేరాఫ్ కేంద్రంగా పాలన సాగించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వేడుకున్నారు. దీంతో ఆయన ఆదేశం మేరకు వైకాపా ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా గుర్తింపు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. ఆ తర్వాత ఆయన సూచనలు, సలహాల మేరకు కొందరు వైకాపా పెద్దలు, ఐపీఎస్ అధికారులు కలిసి ముంబై నటిని వేధించి, కేసు విత్ డ్రా చేసుకునేలా చేశారు. ఈ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో తవ్వేకొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
జేఎస్‌డబ్ల్యూ సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్‌పై ముంబైలో ఆమె పెట్టిన అత్యాచారం కేసును గుట్టుగా సెటిల్ చేసేందుకే.. ఆ నటి, ఆమె తల్లిదండ్రులపై విజయవాడలో అక్రమ కేసు బనాయించి, అరెస్టు చేశారన్న విమర్శలున్నాయి. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్నిలు అధికార దుర్వినియోగం చేసి ఈ అరాచకానికి పాల్పడ్డారు. బాధిత మహిళ, ఆమె తల్లిదండ్రులను బెదిరించి నోరెత్తకుండా చేశారు. వారు చెప్పినవాటికల్లా అంగీకరించిన తర్వాత ఆమెను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చారని తెలుస్తోంది.
 
కాగా, సజ్జన్ జిందాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ సినీనటి ముంబైలోని బాంద్రా - కుర్లా కాంప్లెక్స్ పోలీసు స్టేషనులో కొన్నాళ్ల కిందట ఫిర్యాదు చేశారు. పోలీసులు సరిగా స్పందించకపోవటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు గతేడాది డిసెంబరులో సజ్జన్ జిందాల్‌పై అత్యాచారం, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించటం, నేరపూరిత బెదిరింపు తదితర అభియోగాల కింద కేసు నమోదవడం ముంబైలో సంచలనం సృష్టించింది. 
 
ఆ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుతున్నవేళ ఈ యేడాది ఫిబ్రవరిలో విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషనులో కృష్ణా జిల్లాకు చెందిన వైకాపా నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు ఆ సినీనటి, ఆమె తల్లిదండ్రులపై పోలీసులు మోసం, ఫోర్జరీ కేసు నమోదు చేశారు. ఆఘమేఘాలపై నాటి డీసీపీ విశాల్ గున్ని, ఏడీసీపీ రమణమూర్తి, ఏసీపీ హనుమంతరావు, సీఐ శ్రీధర్, ఎస్ఐ షరీఫ్ తదితరులతో కూడిన బృందం విమానంలో ముంబైకి వెళ్లి వారిని అరెస్టు చేసి తీసుకొచ్చారు.
 
సినీనటి, ఆమె తల్లిదండ్రులను ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. తాము చెప్పినవాటికల్లా అంగీకరిస్తే బెయిల్ వచ్చేలా చేస్తామని.. లేదంటే నెలల తరబడి జైలులోనే మగ్గిపోవాల్సి ఉంటుందని బెదిరించారు. దిక్కుతోచని స్థితిలో వారు అంగీకరించటంతో మార్చి 15న పోలీసులే బెయిల్ ఇప్పించారు. తర్వాత వారి నుంచి పలు కీలక పత్రాలు, ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం. 
 
ఆ తర్వాత బాధిత కుటుంబం తర్వాత ముంబైకి వెళ్లిపోయింది. విజయవాడ జైలు నుంచి సినీనటి, ఆమెకు కుటుంబం విడుదలైన రెండు రోజులకే (మార్చి 17న) ముంబైలో సజ్జన్ జిందాల్‌పై నమోదైన కేసును అక్కడి పోలీసులు మూసేశారు. అత్యాచారం జరిగిందనేందుకు తగిన ఆధారాలను బాధితురాలు సమర్పించలేదని, వాంగ్మూలమివ్వటానికి రావాలని పదేపదే కోరినా స్పందించలేదంటూ న్యాయస్థానంలో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేశారు. ఈ గుట్టంతా ఇపుడు వెలుగులోకి వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు