రాజీనామా చేస్తానంటున్న వైకాపా ఎమ్మెల్యే.. రాజధాని కోసం కాదట...

గురువారం, 30 జనవరి 2020 (07:59 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ధిక్కార స్వరం వినిపించింది. నిన్నామొన్నటివరకు తాను చెప్పిందే వేదమంటూ భావిస్తూ వచ్చిన ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యే తేరుకోలేని షాకిచ్చారు. పార్టీ పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుని, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ హెచ్చరించారు. ఆ ఎమ్మెల్యే పేరు శిల్పా చక్రపాణి రెడ్డి. శ్రీశైలం అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
ఈయన కర్నూలు జిల్లా ఆత్మకూరులో మీడియాతో మాట్లాడుతూ, దేశంలోని ముస్లింలపై వివక్ష చూపేలా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలకు తమ పార్టీ మద్దతివ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. 
 
సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలకు వైసీపీ ఎంపీలు మద్దతివ్వడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. చట్టం అమల్లో భాగంగా ముస్లింలకు ఇబ్బందులు తలపెడితే సహించేది లేదన్నారు. అవసరమైతే రాజీనామా చేసేందుకూ వెనుకాడనని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లామని, ఆ చట్టాలతో ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లదని ఆయన స్పష్టం చేశారన్నారు.
 
అయితే, ఆయన మూడు రాజధానుల అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. తమకు రాయలసీమ ప్రాంతం అభివృద్ధే ముఖ్యమన్నారు. పైగా, సీఆర్డీఏ రద్దు చట్టం, మూడు రాజధానుల అంశాన్ని పార్టీ విధానపరంగా చూసుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు