విపక్ష వైకాపాకు దెబ్బమీద దెబ్బ - బీజేపీలో చేరిన జకియా ఖానం

ఠాగూర్

బుధవారం, 14 మే 2025 (13:38 IST)
గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైకాపాకు ఇపుడు దెబ్బమీద దెబ్బ తగులుతూనే వుంది. ఆ పార్టీకి చెందిన అనేక మంది నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ప్రస్తుతం శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన జకియా ఖానం పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బంది ద్వారా శాసనమండలి కార్యాలయానికి పంపించారు. 
 
అయితే, వైకాపాకు రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఆమె కమలం పార్టీలో చేరడం గమనార్హం. విజవవాడలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జకియా ఖాన్ మాట్లాడుతూ, ప్రధాని మోడీకి అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ముస్లిం మహిళలకు భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. 
 
కాగా, అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖాన్ 2020 జులైలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. అనంతరం ఆమె శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌‍గా కూడా ఎన్నికయ్యారు. కొంతకాలంగా వైకాపా అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్న జకియా ఖానం తాజాగా తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాతో వైకాపా వీడిన ఎమ్మెల్సీల సంఖ్య ఆరుకు చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు