‘క్యాన్సర్ చికిత్సతో గుండెపోటు వచ్చినా బతికి బయటపడ్డాను’

సోమవారం, 23 సెప్టెంబరు 2019 (16:19 IST)
ఫోటో కర్టెసీ-సోషల్ మీడియా
''ఐదేళ్లుగా జరిగినదంతా ఓ అద్భుతంలా ఉంది'' అని వెస్ట్ ససెక్స్‌లోని క్రావ్లేకు చెందిన క్రీనా ధిమన్ అన్నారు. క్రీనాకు 33 ఏళ్లున్నప్పుడు 2013లో క్యాన్సర్ ఉందని తెలిసింది. వ్యాధి బయట పడటానికి కొన్నాళ్ల ముందే ఆమె పెళ్లి చేసుకున్నారు. ఒక ఏడాది పాటు ప్రపంచమంతా తిరిగివచ్చారు.

 
''నా చనుమొనల్లో తేడా కనిపించింది. ఎందుకిలా జరుగుతుందో తెలుసుకోడానికి గూగుల్ చేశాను. దేవుడా.. ఈ వ్యాధి నాకు రాకూడదని అనుకున్నాను'' అని ఆమె చెప్పారు. మూడేళ్ల తర్వాత ఆపరేషన్ చేసి ఆమె రొమ్మును తొలగించారు. కీమోథెరపీ, రేడియోథెరపీ, మరికొన్ని పెద్ద సర్జరీలు కూడా చేశారు. క్యాన్సర్ చికిత్స వల్ల వంధ్యత్వం వస్తే ఇబ్బంది కాకుండా ముందే తన పిండాలను ఆమె భద్రపరిచారు.

 
చికిత్స కోసం కెనడా వెళ్లిన క్రీనా అక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమె అప్పటికే అలసిపోయారు. ఛాతి బిగువైంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. డాక్టర్లు కూడా అయోమయానికి గురయ్యారు. చికిత్స సమయంలో గుండెపోటు రావడంతో క్రీనాకు డాక్టర్లు అత్యవసర చికిత్స అందించారు. క్యాన్సర్ చికిత్స సమయంలో కొందరికి గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 10 మందిలో ఒకరు మాత్రమే బతికే అవకాశం ఉంది.

 
కీమోథెరపీ మందులు గుండె కండరాలకు హాని కలిగించడం వల్ల ఈ సమస్య వస్తుంది. గుండె కండరాలు రక్తాన్ని సరఫరా చేయలేకపోతాయి. చివరకు ఇది గుండె వైఫల్యానికి దారితీస్తుంది. ఈ సమయంలో కార్డియో-ఆంకాలజీ చికిత్సలు చేయాలి.

 
'గర్భం చాలా ప్రమాదకరం'
శ్వాస తీసుకోడానికి పోరాడుతున్న క్రీనా వంటి రోగులు కూడా సాధారణ జీవితాన్ని గడపవచ్చు. ''నేను కోలుకోవడం అనేది నమ్మశక్యంకాని విషయం. ఇంటికి వస్తానని అనుకోలేదు'' అని ఆమె తెలిపారు. కెనడియన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలోనే బంధువులకు తన పరిస్థితిపై ఆమె వాయిస్ మెసేజ్‌లు పంపించారు.

 
అక్కడ ఉన్న రెండు నెలల పాటు భర్త సంరక్షణలో ఉంటూ ఉప్పు లేని ఆహారం తీసుకుంటూ గడిపారు. కొన్నాళ్లకు ఆమె గుండె పనితీరు మెరుగుపడింది. దీంతో ఆమె తిరిగి ఇంగ్లండ్ వెళ్లారు. చికిత్స, మందులు తీసుకోవడంతో గుండె సాధారణ స్థితికి వచ్చింది. అయితే, ఈ పరిస్థితుల్లో బిడ్డను కనడం గుండెకు ప్రమాదకరమని డాక్టర్లు ఆమెకు సూచించారు. ''దీంతో మేం ప్రత్యామ్నాయం కోసం అన్వేషించాం'' అని క్రీనా చెప్పారు.

 
'చాలా సంతోషంగా ఉంది'
''నాకు ఒక సర్రోగేట్ (అద్దె గర్భం) దొరికారు. ఆమె ద్వారా నాకు ఒక బిడ్డ పుట్టింది. ఇప్పుడు తన వయసు 16 నెలలు. వచ్చే నెలలో హిమాలయ పర్వతాలను అధిరోహించడానికి వెళుతున్నాను. అసాధారణమైన జీవితాన్ని నేను గడుపుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది'' అని క్రీనా చెప్పారు.

 
''నా 40వ పుట్టినరోజు చూస్తానని అనుకోలేదు. ఇంకా రెండు వారాల్లో నా పుట్టినరోజు వస్తోంది'' అని ఆమె తెలిపారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో కోపా ఫీల్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ యాత్ర ఏర్పాటు చేసింది. అందులో క్రీనా అతిముఖ్యమైన వ్యక్తి.

 
''కీమోథెరపీ తర్వాత ఎక్కువమంది క్యాన్సర్ నుంచి బయటపడుతున్నారు. కానీ, తర్వాత వేరే వ్యాధులు వారిని చుట్టుముడుతున్నాయి. దీనిపై రోగులు, వైద్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది'' అని ఆమె చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు