10 అడుగుల ఎత్తు నుంచి దూకేసి ప్రాణాలు దక్కించుకున్నాను, కరాచీ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ జుబైర్

శనివారం, 23 మే 2020 (11:58 IST)
కరాచీ విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బతికి బయటపడ్డ ప్రయాణికుడు ముహమ్మద్ జుబైర్ భయంతో వణికిపోతూ చెప్పిన మాట ఇది. ఈ ఘోర ప్రమాదం నుంచి సజీవంగా బయటపడిన ఇద్దరిలో జుబైర్ ఒకరు.
 
ఎలా బయటపడ్డారు?
పీకే 8303 నంబర్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో లాహోర్ నుంచి వెళ్తూ కరాచీలో దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికుల్లో చాలామంది రంజాన్ సందర్భంగా ఇళ్లకు వెళ్తున్న కుటుంబాలున్నాయి.

 
కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో పాకిస్తాన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30కి దిగేందుకు సిద్ధమవుతూ కూలిపోయింది. తొలుత ల్యాండింగ్‌ చేస్తున్నట్లుగా అనిపించిందని.. అక్కడికి 10-15 నిమిషాల్లోనే కూలిపోయిందని జుబైర్ చెప్పారు.

 
విమానంలో ఉన్న 99 మందిలో 97 మంది మరణించగా జుబైర్, మరొకరు బయపడ్డారు. జుబైర్‌కు చిన్నపాటి గాయాలయ్యాయి. ''విమానం కూలిపోతుందని ఎవరూ ఊహించలేదు. అప్పటివరకు చాలా సాఫీగా ఎగురుతూ వచ్చింది'' అన్నారు జుబైర్. విమానం కూలిపోయిన తరువాత జుబైర్ స్పృహ కోల్పోయారు.

 
కోలుకున్నాక ఆయన మాట్లాడుతూ.. ''అన్ని వైపుల నుంచీ అరుపులు, ఏడుపులు వినిపించాయి. పిల్లలు, పెద్దవాళ్లు అంతా భయంతో అరుస్తున్నారు. అయితే, వారెవరూ నాకు కనిపించలేదు. వారి అరుపులే వినిపిస్తుండగా ఎటుచూసినా మంటలే కనిపించాయి'' అన్నారు.

 
'విమానం కూలిన వెంటనే అన్నివైపుల నుంచి అరుపులు కేకలు వినిపించాయి. నేను నా సీటు బెల్టు తొలగించాను. దగ్గర్లో చిన్న వెలుగు కనిపించింది. అక్కడికి వెళ్లి సుమారు 10 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నాను'' అని చెప్పారు జుబైర్.

 
ఎలా కూలిపోయింది?
విమానం దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ పనిచేయలేదని, దాంతో పైలట్ మరోసారి ప్రయత్నించేసరికి విమానం కూలిపోయిందని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ చైర్మన్ అర్షద్ మాలిక్ తెలిపారు. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు పైలట్ ట్రాఫిక్ కంట్రోల్‌కు చెప్పారన్నారాయన.

 
విమానం ఒక చిన్న వీధిలో కూలిపోయిందని.. అందువల్ల సహాయ చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాలిక్ తెలిపారు. సహాయ చర్యలు పూర్తికావడానికి రెండుమూడు రోజులు పడుతుందని ఆయన చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు