గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత స్టేట్ బ్యాంకు రూ.2742 కోట్ల నికర ఆదాయం సాధించింది. ఇది గత యేడాదితో పోల్చితే 46 శాతం అధికమని ఆ బ్యాంకు ప్రకటించింది. వడ్డీలపై అధిక ఆదాయంతో పాటు ఇతర ఆదాయాలు పెరగటంతో నికర లాభంలో పెరుగుదల నమోదు చేసుకున్నట్లు బ్యాంకు పేర్కొంది.
ఇదే కాలానికి వడ్డీ ఆదాయం 28 శాతం పెరిగి 17,342 కోట్ల రూపాయలకు చేరుకుందని ఎస్బీఐ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతున్నా బ్యాంకు ఆశించిన స్థాయిలోనే వృద్ధిని నమోదు చేసుకుందని ఎస్బీఐ ఛైర్మన్ ఒ.పి.భట్ తెలిపారు. 2008-09 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను 9,121 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది.
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నికర లాభంలో 36 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్లు బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.కె.భట్టాచార్య తెలిపారు. అంతేకాకుండా ఇదేకాలంలో బ్యాంకు మొత్తం ఆదాయం 33 శాతం పెరిగి 76,479 కోట్ల రూపాయలకు చేరుకోవటమే కాకుండా వడ్డీ ఆదాయం 48,950 కోట్ల రూపాయల నుంచి 63,788 కోట్ల రూపాయలకు పెరిగిందని భట్టాచార్య వెల్లడించారు.