తగ్గిన చక్కెర ఉత్పత్తులు : ఇస్మా

మంగళవారం, 2 ఫిబ్రవరి 2010 (13:04 IST)
FILE
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకు దేశంలో 78.4 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తయ్యింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఉత్పత్తైన చక్కెరతో పోలిస్తే రెండు లక్షల టన్నులు తక్కువగా ఉందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్ ఎన్ రావ్ తెలిపారు.

దేశంలో అత్యధికంగా చెరకు దిగుబడి చేసే రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో చెరకు దిగుబడి తగ్గడంతో చక్కెర ఉత్పత్తులు తగ్గాయని ఇస్మా తెలిపింది. గత సంవత్సరం ఇదే కాలానికి దేశవ్యాప్తంగా 80.4 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తైనట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం దేశంలో చెరకు ఉత్పత్తుల్లో తగ్గుముఖం పట్టిందని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చెరకు పంట సాగు ఆలస్యంగా ప్రారంభించారన్నారు. అదే విధంగా పంజాబ్, తమిళనాడు, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోను చక్కెర ఉత్పత్తులు తగ్గాయన్నారు.

ఈ ఏడాది జనవరి 15 వరకు తమకు అందిన సమాచారం మేరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చక్కెర ఉత్పత్తులు 10 శాతం తగ్గి 21.6 లక్షల టన్నులకు చేరుకుంది. అదే గత సంవత్సరం ఇదే కాలానికి 24 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తైనట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చక్కెర ఉత్పత్తులు దాదాపు 160 లక్షల టన్నులకు చేరుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తమిళనాడు రాష్ట్రంలో చక్కెర ఉత్పత్తులు 3.2 లక్షల టన్నులుగా ఉంది. అదే గత సంవత్సరం ఇదే కాలనికి 3.9 లక్షల టన్నులుగా ఉండిందన్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 28.3 లక్షల టన్నులుండగా గత సంవత్సరం ఇదే కాలానికి 27.3 లక్షల టన్నులుగా ఉండిందన్నారు. కర్నాటకలో చక్కెర ఉత్పత్తులు 11.7 లక్షల టన్నులుండగా గత సంవత్సరం ఇదే కాలానికి 11.5 లక్షల టన్నులుగా ఉండింది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కెర ఉత్పత్తుల్లో మార్పు సంభవించలేదు. అంటే ప్రస్తుతం, గత సంవత్సరం 2.8 లక్షలుగానే ఉండిందన్నారు.

దేశంలో ప్రతి సంవత్సరం చక్కెర 2.3 కోట్ల టన్నుల వినియోగం జరుగుతోందని, చక్కెర తక్కువపడితే విదేశాల నుంచి దిగుమతి చేసుకుని వినియోగదారులకు అందజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వివరించారు.

వెబ్దునియా పై చదవండి