గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద బీమా వివరాలు దేశ చరిత్రలోనే చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రమాదం కారణంగా దేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన బీమా క్లెయిమ్ నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానానికి సంబంధించిన ఎయిరిండియా సంస్థ బీమా కవరేజీని ఇంజిన్ మార్పిడికి ముందే రూ.750 కోట్ల నుంచి రూ.850 కోట్లకు పెంచింది.
ఈ నేపథ్యంలో ఈ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వ రంగ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ దిగ్గజం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ) మొత్తం క్లెయిమ్లు సుమారు 475 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.4091 కోట్లుగా అంచనా వేసింది. ఇది మన దేశంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక విమాన బీమా క్లెయిమ్గా రికార్డు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ భారీ మొత్తంలో విమాన నష్టానికి రూ.125 మిలియన్ డాలర్లు కాగా, ప్రయాణికుల కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం, థర్డ్ పార్టీ నష్టాలు, ఇతర వ్యక్తులకు జరిగిన నష్టాలు, ట్రావెల్ పాలసీల కింద మరో 350 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని జనరల్ ఇన్యూరెన్స్ సీఎండీ రామస్వామి నారాయణన్ వెల్లడించారు. కాగా, ప్రస్తుతం ఈ విమాన ప్రమాదంపై ముమ్మరంగా దర్యాప్తు సాగుతోంది.