పండగ సీజన్.. రద్దీ మార్గాల్లో ఇపుడే పెరిగిపోయిన విమాన చార్జీలు

ఠాగూర్

మంగళవారం, 20 ఆగస్టు 2024 (14:45 IST)
దేశంలో పండగ సీజన్ మొదలైంది. దీంతో రద్దీ మార్గాల్లో విమాన చార్జీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ పండగ సీజన్ కోసం అప్పుడే విమాన టికెట్లను బుక్ చేసుకోవడం ప్రారంభించడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఫలితంగా రద్దీ మార్గాల్లో విమాన ఛార్జీలు అధికమవుతున్నాయి. దీపావళి ఒకటో తేదీకి ముఖ్యమైన దేశీయ మార్గాల్లో ఒకవైపు ప్రయాణానికే టికెట్ ధర సగటున 10-15 శాతం పెరిగింది. 
 
ఓనం పండగ (సెప్టెంబరు 15) సమయంలో, కేరళ నగరాలకు వెళ్లే కొన్ని విమానాల్లో ఛార్జీలను 20-25 శాతం పెంచేశారని ట్రావెల్ పోర్టల్ ఐక్సిగో వెల్లడించింది. అక్టోబరు 30- నవంబరు 5 మధ్య ఢిల్లీ- చెన్నై నాన్ స్టాప్ విమానంలో ఒకవైపు ఎకానమీ సగటు ఛార్జీ 25 శాతం పెరిగి రూ.7,618గా ఉందని వెల్లడించింది. 
 
ముంబై- హైదరాబాద్ మార్గంలో ఛార్జీ 21 శాతం పెరిగి రూ.5,162కు, ఢిల్లీ - గోవా, దిల్లీ - అహ్మదాబాద్ మార్గాల్లో ఛార్జీలు 19 శాతం పెరిగి వరుసగా రూ.5,999, రూ.4,930గా ఉన్నాయని ఐక్సీగా పేర్కొంది. కొన్ని ఇతర మార్గాల్లో ఛార్జీల భారం 1-16 శాతంగా ఉంది. గతేడాది దీపావళి పండుగ సమయమైన నవంబరు 10-16 తేదీల మధ్య ఉన్న ప్రయాణ ఛార్జీలతో పోల్చి, ఐక్సిగో ఈ విశ్లేషణ చేసింది.
 
గతేడాదితో పోలిస్తే ఈసారి దీపావళికి ప్రయాణ గిరాకీతో పాటు ఛార్జీలు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీ-చెన్నై, ముంబై-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్ వంటి రద్దీ మార్గాల్లో ఛార్జీలు 10-15 శాతం పెరిగి రూ.4000-5000కు చేరాయని ఐక్సిగో గ్రూప్ సహ సీఈఓ రజనీశ్ కుమార్ తెలిపారు.
 
అదేసమయంలో కొన్ని మార్గాల్లో ఛార్జీలు యేడాది క్రితంతో పోలిస్తే 1-27 శాతం తగ్గడం గమనార్హం. ముంబయి-అహ్మదాబాద్ మధ్య టికెట్ ధర 27 శాతం తగ్గి రూ.2,500కు, ముంబై- ఉదయ్‌పూర్ మార్గంలో ఛార్జీ 25 శాతం తక్కువగా రూ.4,890గా ఉంది. బెంగళూరు-హైదరాబాద్ విమాన ఛార్జీ 23 శాతం తగ్గి రూ.3,383గా ఉంది. ముంబై-జమ్మూ విమాన ఛార్జీ 21 శాతం తగ్గి రూ.7,826గా ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు