బంగారంతో పోటీపడుతున్న వెండి - రోజురోజుకూ పెరుగుతున్న ధరలు!!

ఠాగూర్

ఆదివారం, 30 మార్చి 2025 (10:04 IST)
బంగారం ధరలతో వెండి ధరలు పోటీపడుతున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ కారణంగా దేశీయంగా రికార్డు స్థాయి గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.92,150లకు చేరుకుంది. అదేసమయంలో బంగారం ధర రూ.92 వేలకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
ఇదే సమయంలో వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగి ప్రజలను షాక్‌కు గురిచేస్తున్నాయి. కిలో వెండి ధర రూ.1.03 లక్షలకు చేరుకుంది. గత యేడాదిలో బంగారం, వెండి ధరలు 37 శాతం మేరకు పెరగగా, గత నెలలో బంగారం ధర 6.70 శాతం, వెండి ధర రూ.8.80 శాతం మేరకు పెగిగాయి. 
 
2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బంగారం 31.37 శాతం రాబడిని ఇవ్వగా వెండి మాత్రం దానికంటే అధికంగా 35.56 శాతం రాబడిని అందిచింది. బంగారం, వెండి పెట్టుబడిదారులకు అధిక లాభాలను అందిస్తుండటం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు వెండిపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. బంగారం కంటే వెండి ఎక్కువ లాభదాయకంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో వెండి ధరలు రూ.1.25 లక్షలు దాటే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు