ఆర్బీఐ కీలక నిర్ణయం: విదేశాల్లోని వారికీ ఆన్‌లైన్ ద్వారా డబ్బులు

బుధవారం, 15 సెప్టెంబరు 2021 (13:29 IST)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో సైతం యూపీఐ సేవలు అందించనుంది. ఇందులో భాగంగా విదేశాల్లోని వ్యక్తులకు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపించే ఏర్పాటు చేస్తోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ సౌకర్యం 2016లో అందుబాటులో వచ్చింది. ప్రారంభంలో నెమ్మదిగా ఉన్నా ఆ తరువాత సాధారణమైపోయింది. 
 
చిన్న చిన్న పాన్ డబ్బా షాపుల్లో కూడా యూపీఐ పేమెంట్స్ అందుబాటులో వచ్చేశాయి. ఆఖరికి కూరగాయల బండిలో కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. స్వదేశంలో అంతా బాగానే ఉంది కానీ విదేశాల్లో ఉన్న వ్యక్తులకు డబ్బులు పంపించడం మాత్రం ఇబ్బందిగా మారింది. ఆన్‌లైన్ అంటే యూపీఐ ద్వారా విదేశాల్లోని వ్యక్తులకు డబ్బులు పంపించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ కష్టాలు తొలగించే దిశగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. 
 
దీనికోసం ముందుగా జీ 20 దేశాలతో అవగాహనకు రావాలని నిర్ణయించింది. ఇండియా-సింగపూర్ దేశాల మధ్య ఆన్‌లైన్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మధ్య ఒప్పందమైంది. 
 
ఈ ఒప్పందం ప్రకారం ఇండియాలోని యూపీఐ యూజర్లు..సింగపూర్‌లో ఉన్న పే నౌ యూజర్లతో తేలిగ్గా ఆర్ధిక లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇప్పుడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2022 జూలై నుంచి ఇండియా-సింగపూర్ మధ్య యూపీఐ చెల్లింపులు ప్రారంభం కానున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు