కర్నాటక బ్యాంకు వీర బాదుడు.. ఈఎంఐ చెల్లించలేదని 7 రెట్ల పెనాల్టీ

శుక్రవారం, 29 మే 2020 (11:59 IST)
కరోనా కష్టకాలంలో భారత రిజర్వు బ్యాంకు అన్ని రకాల రుణాలపై తొలుత మూడు నెలల మారటోరియం విధించింది. ఆ తర్వాత దీన్ని ఆరు నెలలకు పొడగించింది. అంటే.. ఈఎంఐలు చెల్లించకపోయినా బ్యాంకులు అపరాధ రుసుం వసూలు చేయడానికి వీల్లేదు. ఈ విషయంపై ఆర్బీఐ స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. అయితే, కర్నాటక బ్యాంకుకు మాత్రం ఇవేమీ వర్తించినట్టు లేదు. అసలు దేశం కరోనా కష్టాల్లో చిక్కుకుందన్న చింతకూడా లేనట్టుగా వుంది. అందుకే, ఈఎంఐ చెల్లించని ఖాతాదారులకు భారీ వడ్డన విధించింది. ఈఎంఐ చెల్లించలేదన్న కారణంతో ఏకంగా ఏడు రెట్ల జరిమానా విధించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈఎంఐ చెల్లింపులను కేంద్రం వాయిదా వేసినప్పటికీ సదరు బ్యాంకు మాత్రం ఏకంగా ఏడురెట్ల మొత్తాన్ని జరిమానా విధించడంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులను బ్యాంకు దోపిడీ చేస్తోందని ఆరోపిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్ణాటకకు చెందిన బాధితుడు సంగమేశ్ హడపద కర్ణాటక బ్యాంకులో రూ.30 వేలు రుణం తీసుకున్నాడు. కరోనా లాక్డౌన్ కారణంగా ఒక నెల వాయిదాను చెల్లించలేకపోయాడు. ఈఎంఐ చెల్లించకపోవడంతో బ్యాంకు రూ.4,150 జరిమానా విధించింది. 
 
దీంతో సంగమేశ్ షాకయ్యాడు. వెంటనే బ్యాంకు ఉన్నతాధికారులను కలిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వాపోయాడు. తాను నెలకు రూ.3 వేలు చెల్లించేవాడినని, కరోనా లాక్డౌన్ కారణంగా వ్యాపారం సరిగా సాగక చెల్లించలేకపోయానని చెప్పాడు. ఈఎంఐ చెల్లింపులను ప్రభుత్వం వాయిదా వేసినా బ్యాంకు భారీ మొత్తంలో జరిమానా విధించడం అన్యాయమని సంగమేశ్ వాపోయాడు. దీనిపై న్యాయపోరాటం చేయనున్నట్టు తెలిపాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు