ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు.. ప్రజల వద్దే రూ.18.5 లక్షల కోట్ల కరెన్సీ

సోమవారం, 11 జూన్ 2018 (10:15 IST)
భారత ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు పొంచివుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేశారు. ఈ నోట్ల రద్దుతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
 
ముఖ్యంగా దేశంలో ఉన్న రూ.2 వేల నోటును రద్దు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. దీంతో ప్రజలు డబ్బును తమ వద్దే భద్రంగా దాచుకుంటున్నారు. అలా దాచుకున్న డబ్బు ప్రజల వద్ద ఏకంగా రూ.18.5 లక్షల కోట్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 
 
నోట్ల రద్దుతో చేతిలో చిల్లిగవ్వ లేక నానా ఇబ్బందులు పడిన ప్రజలు.. తిరిగి చలామణి ఊపందుకోగానే జాగ్రత్త పడడం మొదలుపెట్టారు. తమ వద్ద కొచ్చిన డబ్బులను ఎంచక్కా ఇంట్లోనే భద్రపరుచుకుంటున్నారు. 
 
ఫలితంగా నోట్ల రద్దుకు ముందు ప్రజల వద్ద ఉన్న సొమ్ముకంటే లక్షన్నర కోట్లు అధికంగా పోగు అయింది. స్వయంగా భారతీయ రిజర్వు బ్యాంకు ఈ విషయాన్ని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. నోట్ల రద్దుకు ముందు, ఆ తర్వాత కూడా ఇంత దారుణమైన పరిస్థితులు లేవని ఆర్బీఐ తెలిపింది. 
 
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని విలువల నోట్లను కలుపుకుంటే మొత్తం రూ.19.3 లక్షల కోట్లు చలామణిలో ఉందని ఆర్బీఐ తెలిపింది. అయితే, తమ వద్దకు చేరిన డబ్బును ప్రజలు తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు వెనకాడుతుండడంతో రూ.18.5 లక్షల కోట్లు వారి వద్దే ఉండిపోయాయని భారత రిజర్వు బ్యాంకు అధికారులు చెపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు