దేశంలో రూ.2 వేల నోటు ముద్రణను నిలిపివేసిన ఆర్బీఐ

ఆదివారం, 9 ఆగస్టు 2020 (09:24 IST)
భారత రిజర్వు బ్యాకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న 2 వేల రూపాయల నోటు ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. దీనికి నిదర్శనమే గడచిన ఆర్థిక సంవత్సరంలో ఒక్కటంటే.. ఒక్క రూ.2 వేల నోటును ముద్రించలేదు. ఈ విషయాన్ని ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ పెట్టుకున్న దరఖాస్తుకు సమాధానంగా స్వయంగా ఆర్బీఐ తెలియజేసింది. 
 
కాగా, నాలుగేళ్ళ క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అప్పటివరకు చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. వీటి స్థానంలో కొత్తగా రూ.500 నోటు, రూ.2000 నోటును తీసుకొచ్చారు. ఆపై 2016-17 ఆర్ధిక సంవత్సరంలో రూ.354.29 కోట్లు, 2017-18లో రూ.11.15 కోట్లు, 2018-19లో రూ.4.66 కోట్ల విలువైన 2 వేల నోట్లను ముద్రించింది. కానీ, గత సంవత్సరం మాత్రం ఎటువంటి ముద్రణా కార్యకలాపాలు చేపట్టలేదు.
 
ఇదేసమయంలో రూ.500 నోట్ల ముద్రణ మాత్రం గణనీయంగా పెరిగింది. 2016-17లో ముద్రితమైన రూ.429.22 కోట్ల విలువైన 500 నోట్లతో పోలిస్తే, గత సంవత్సరం దాదాపు రెట్టింపుగా రూ.822.77 కోట్ల విలువైన ముద్రణ జరిగిందని ఆర్బీఐ పేర్కొంది. మొత్తం మీద ఈ నాలుగేళ్లలో రూ.2,458.57 కోట్ల విలువైన రూ.500 నోట్లు, రూ.370.10 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లను ఆర్బీఐ ముద్రించింది.
 
ఇక 1, 2, 5 రూపాయల నోట్ల ముద్రణను సైతం ఆర్బీఐ గత నాలుగేళ్లుగా నిలిపివేసింది. అన్ని రకాల నోట్లనూ కలిపి గత నాలుగేళ్లలో 7,071.63 కొత్త నోట్లను ముద్రించినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ముద్రణా వ్యయం విషయానికి వస్తే రూ.200 నోటుకు అత్యధికంగా రూ.2.15 చొప్పున ఖర్చు పెడుతున్నామని, రూ.500 నోటుకు రూ.2.13, రూ.100 నోటుకు రూ.1.34 ఖర్చవుతోందని పేర్కొంది. రూ.50 నోటుకు 82 పైసలు, రూ.20 నోటుకు 85 పైసలు, రూ.10 నోటుకు రూ.75 పైసలు వ్యవమవుతోందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు