ఈ ఏడాది ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంజా ప్రకటించిన ఆర్బీఐ.. ఈసారి మాత్రం ఆచితూచి వ్యవహరించింది. ట్రంప్ టారిఫ్ ప్రకటనలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా 5.5 శాతం వద్దే ఉంచింది. ఈమేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు.
ద్రవ్యోల్బణం అంచనాలకు మించి తగ్గినప్పటికీ.. అమెరికా టారిఫ్లపై అనిశ్చితులు ఇంకా తొలగలేదని ఆర్బీఐ గవర్నర్ ఈసందర్భంగా పేర్కొన్నారు. అందువల్ల రెపో రేటును యధాతథంగా 5.5 శాతం వద్దే ఉంచాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇక, స్థిర విధాన వైఖరిని కమిటీ మరింత కాలం కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.
కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ.. జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెపో రేటు ఒక శాతం వరకు దిగొచ్చింది.