కొత్త సంవత్సరంలో అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు ఏంటి?

గురువారం, 28 డిశెంబరు 2023 (11:29 IST)
మరికొన్ని రోజుల్లో 2023 సంవత్సరం ముగిసి 2024లోకి అడుగుపెట్టనున్నాం. ఈ కొత్త సంవత్సరంలో అనేక కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా, బ్యాంకింగ్, ఆధార్, ఐటీ తదితర విషయాల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. డిసెంబరు 31వ తేదీతో ఉచితంగా ఆధార్ వివరాలు మార్చుకునేందుకు చివరి తేదీగా ప్రకటించారు. జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త సిమ్ కార్డు కొనుగోలుకు డిజిటల్ కేవైసీ తప్పనిసరి చేశారు. డీమాట్ అకౌంట్ నామినేషన్, బ్యాంకు లాకర్ల రివైజ్డ్ అగ్రిమెంట్‌కు డిసెంబరు 31వ తేదీతో గడువు ముగియనుంది. 
 
అలాగే, డీమాట్ అకౌంట్ హోల్డర్లు జనవరి ఒకటో తేదీ లోపు తమ నామినేషన్ వివరాలు సమర్పించాలి. ఈ రూల్ పాటించని వాళ్లు స్టాక్స్ ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేరు. ఆధార్ కార్డు వివరాల్లో ఉచితంగా మార్పులు చేసుకునేందుకు డిసెంబర్ 31 చివరి తేదీ. ఆ తర్వా చేసుకునే మార్పులకు రూ.50 రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
 
సిమ్ కార్డుల కేవైసీ ధ్రువీకరణ మొత్తం ఇకపై డిజిటల్ రూపంలోనే జరుగుతుంది. ఎటువంటి దరఖాస్తులు నింపాల్సిన అవసరం ఉండదు. కొత్త సిమ్ కొనుగోలు సమయంలో టెలికాం కంపెనీలు కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తాయి. మోసాలకు కళ్లెం వేసేందుకు ఈ నిబంధన ప్రవేశపెట్టారు.
 
బ్యాంక్ లాకర్లు ఉన్న వారందరూ డిసెంబర్ 31లోపు తమ బ్యాంకులతో రివైజ్డ్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలి. లేకపోతే, లాకరు ఫ్రీజ్ చేస్తారు. కొత్త టెలీకమ్యూనికేషన్ బిల్లు ప్రకారం, ఫేక్ సిమ్‌లు కొనుగోలు చేసేవారికి మూడేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. 2022-23 సంవత్సరానికి చెందిన ఐటీ రిటర్నుల దాఖలుకు డిసెంబర్ 31 చివరి తేదీ. ఈలోపు పెనాల్టీతో సహా రిటర్నులు దాఖలు చేయాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు