ఖాతాదారులకు మరో శుభవార్త చెప్పిన ఎస్.బి.ఐ

గురువారం, 16 ఏప్రియల్ 2020 (14:09 IST)
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు తమ ఖాతాదారులకు మరో శుభవార్త తెలిపింది. గ‌త నెల‌లో కనీస నిల్వ (మినిమం బ్యాలెన్స్) లేకుంటే విధంచే అపరాధ రుసుంను ఎత్తివేసింది. 
 
ఇపుడు తాజాగా క‌స్ట‌మ‌ర్ల‌కు మేలు చేసే మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. ఏటీఎం విత్‌డ్రాయ‌ల్స్‌పై స‌ర్వీస్ చార్జీల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఎస్.బి.ఐ ఏటీఎం కార్డుల‌తో ఎన్నిసార్ల‌యినా న‌గ‌దు విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం ల‌భించింది. 
 
అంతేకాదు, ఎస్‌బీఐ ఏటీఎంలే కాకుండా ఇత‌ర‌ బ్యాంకుల ఏటీఎంల నుంచి కూడా ఎస్‌బీఐ ఏటీఎం కార్డుల‌తో ఎన్నిసార్ల‌యినా నగదును విత్ డ్రా చేసుకోవచ్చని భారతీయ స్టేట్ బ్యాంకు స్పష్టం చేసింది. 
 
కరోనా వైరస్ విస్తరణ, లాక్‌డౌన్ నేప‌థ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అయితే ఈ వెసులుబాటు జూన్ 30 వ‌ర‌కే వ‌ర్తిస్తుంద‌ని ఎస్.బి.ఐ ఓ ప్రకటనలో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు