కనీస నిల్వ రూ.5 కాదు.. రూ.3 వేలు : ఎస్‌బిఐ తాజా నిర్ణయం

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (10:41 IST)
సేవింగ్స్‌ ఖాతాలో కనీస నిల్వకు సంబంధించి ఖాతాదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో భారతీయ స్టేట్ బ్యాంకు వెనక్కి తగ్గింది. మెట్రో నగరాల్లోని ఖాతాదారులకు ఇంతకుముందు వర్తింపజేసిన నెలవారీ కనీస సగటు నిల్వ (ఎంఎబి)ను 5,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకు తగ్గించింది. అంతేకాకుండా ఖాతాలో కనీస నిల్వను కలిగి ఉండని కస్టమర్ల నుంచి వసూలు చేసే చార్జీలను తగ్గించింది. 
 
పెన్షనర్లు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులు, మైనర్లకు కనీస నిల్వ నిబంధన వర్తించదని పేర్కొంది. ఈ మార్పులు అక్టోబర్‌ నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తాజా నిర్ణయంతో 5 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. 
 
గతంలో మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఎంఎబి 5,000 రూపాయలు, అర్బన్‌, సెమీఅర్బన్‌ శాఖల్లో వరుసగా 3,000 రూపాయలు, 2,000 రూపాయలు, గ్రామీణ శాఖల్లో 1,000 ఉండాలన్న నిబంధనను ఎస్‌బిఐ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
 
అయితే మెట్రో, అర్బన్‌ కేంద్రాల్లోని కస్టమర్లను ఒకేవిధంగా చూడాలన్న ఉద్దేశంతో ఎంఎబిని 3,000 రూపాయలకు తగ్గించినట్టు బ్యాంకు పేర్కొంది. ఇక కనీస నిల్వను కలిగి లేని సందర్భంలో విధించే చార్జీలను 20 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించారు. 
 
బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతా, పిఎం జన్‌ధన్‌ ఖాతాల్లో కనీస నిల్వను కలిగి ఉండాల్సిన అవసరం లేదని బ్యాంకు పేర్కొంది. ఇలాంటి ఖాతాలు 13 కోట్ల వరకు ఉంటాయి. ఎస్‌బిఐ మొత్తం సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదారుల సంఖ్య 42 కోట్లను కలిగివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు