అలా చేస్తేనే పెట్రో ధరలు నేలకు దిగుతాయ్ : ఫడ్నవిస్

గురువారం, 24 మే 2018 (13:50 IST)
దేశవ్యాప్తంగా పెట్రో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశవాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.84గా ఉండగా, చెన్నైలో రూ.80గా ఉంది. అలాగే, వివిధ మెట్రో నగరాల్లో కూడా ఈ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలపై అన్ని విపక్ష పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. తక్షణం ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటివారిలో బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఉన్నారు. పెట్రోల్ ధరల తగ్గింపునకు ఈయన ఓ చిన్న ఉపాయం చెప్పారు.
 
అదేంటంటే... పెట్రోల్ ధరలకు కళ్లెం వేసేందుకు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడమే పరిష్కారమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల తాము వివిధ పన్నులను తగ్గించినప్పటికీ ప్రయోజనం కనిపించడంలేదన్నారు. 'ఇప్పటికే మేము వివిధ పన్నులను చాలావరకు తగ్గించాం. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతుండడం వల్ల ఇప్పుడు మళ్లీ రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి పెట్రోల్‌ను జీఎస్టీ కిందికి తెచ్చేలా జీఎస్టీ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. అప్పుడే పెట్రోల్ ధరలు దిగివస్తాయి' అని వ్యాఖ్యానించారు. మరి కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచిచూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు