పెట్రోల్‌, డీజిల్‌లపై దిగుమతి సుంకాలను తగ్గించే ప్రసక్తే లేదు.. నిర్మలా సీతారామన్

మంగళవారం, 17 ఆగస్టు 2021 (10:05 IST)
పెట్రోల్‌, డీజిల్‌లపై దిగుమతి సుంకాలను తగ్గించే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పెట్రోల్ ధరల పెంపుకు  గత ఏడేళ్లకు ముందు అధికారంలో ఉన్న యూపీఏ సర్కారు విధానాలే ఇందుకు కారణమని ఆమె వ్యాఖ్యానించారు. రిటైల్ పెట్రోల్‌, డీజిల్ ధరలను కృత్రిమంగా తగ్గించేందుకు కేంద్ర చమురు సంస్థలకు కాంగ్రెస్ పాలిత యూపీఏ ప్రభుత్వం బాండ్లను జారీ చేసిందని ఆరోపించిన ఆమె.. సదరు ఆయిల్ బాండ్లపై ఇప్పటికీ తమ ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందని తెలిపారు.
  
ఇక, గత ఐదేళ్ల కాలంలో ఆయిల్ బాండ్లపై ఎన్డీఏ సర్కార్ రూ.60 వేల కోట్ల వడ్డీ చెల్లించినట్లు తెలిపిన నిర్మలా సీతారామన్‌... ఇంకా రూ.1.3 లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. యూపీఏ హయాంలో రూ.1.44 లక్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్ల జారీ చేయడంతో అప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయని.. కానీ, ఆయిల్ బాండ్ల భారం తమ ప్రభుత్వంపై పడిందని.. వాటి కారణంగానే పెట్రోల్‌, డీజిల్ ధరలను తగ్గించలేకపోతున్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.
  
యూపీఏ చేసిన బాండ్ల భారం గనుక లేకుంటే తప్పకుండా చమురు ధరల భారం నుంచి విముక్తి కల్పించేవాళ్లమని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించకపోవడానికి ఇదే కారణమని కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ వివరించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటే తప్ప పరిష్కార మార్గం లేదని.. ఇప్పటికైతే పెట్రోల్‌, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించే సమస్యే లేదు స్పష్టం చేశారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు