విద్యా హక్కు చట్టం ఎవరికి చుట్టం?

బుధవారం, 27 జులై 2011 (17:58 IST)
స్వాతంత్ర్యం వచ్చిన ఆరు దశాబ్దాల అనంతరం 6-14 సంవత్సరాల వయస్సు పిల్లలకు ఉచిత నిర్భంధ విద్యను అందించే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం విద్య హక్కు చట్టాన్ని 2009లో ప్రవేశపెట్టింది. ఈ చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి జమ్మూకాశ్మీర్ మినహా దేశమంతా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రయోజనాలు ఒకసారి చూస్తే.....

1. 6-14 సంవత్సరాల వయస్సు పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య లభిస్తుంది. పిల్లలను బడిలోకి చేర్చుకోకపోవడం, పద్నాలుగేళ్ల లోపు వారి పేర్లను తొలగించడం చేయరాదు.
2. ఈ చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలు పేద పిల్లలకు 25 శాతం, మైనారిటీ పాఠశాలలు 50 శాతం సీట్లను కేటాయించాలి.
3. ఉపాధ్యాయ, విద్యార్ధుల నిష్పత్తి 1:30 ఉండేలా చూడటం.
4. పాఠశాలల్లో అదనపు భవనాలు, బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించడం వంటి మౌలికసదుపాయాలు కల్పించడం.
5. ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం.

ఈ అంశాలన్ని పరిశీలిస్తే విద్యా హక్కు చట్టంతో ప్రభుత్వ పాఠశాలలు బాగుపడి పేద ప్రజలకు ఏదో ఒనగూరుతుందనుకుంటే పొరపాటే.

నిధులు మంజూరు చేయకుండా మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారో అర్ధం కాదు. విద్యకు కేటాయిస్తున్న నిధులు ప్రతి ఏడాది తరగిపోతున్నాయి. పాఠశాలకు అవసరమైన భవనాలు, బోధనా సిబ్బంది లేకుండా చట్టాన్ని ఎలా అమలు చేస్తారో పాలకులకే తెలియాలి.

ప్రపంచీకరణ పుణ్యమాని ఆంగ్ల విద్యా బుద్ధులు నేర్చినవారినే అందలం ఎక్కిస్తుండటంతో తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని భావిస్తున్న ప్రతి తల్లిదండ్రి ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్న ప్రైవేటు పాఠశాలల వైపే మొగ్గుచూపుతున్నారు.

పేద విద్యార్ధులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను కేటాయించాలని విద్యాహక్కు చట్టంలో చేసిన ప్రతిపాదన కూడా ప్రభుత్వ పాఠశాలల పాలిట శాపమే. ఇటువంటి అవకాశాలు వుంటే ప్రైవేటు పాఠశాలలను కాదని ప్రభుత్వ పాఠశాలలకు ఎవరు వస్తారు?

ఇటువంటి టక్కుఠమారా విద్యల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి ప్రపంచబ్యాంక్ ఆదేశాలకు అనుగుణంగా విద్యను ప్రైవేటీకరణ చేయడమే పాలకుల లక్ష్యం. జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే స్కూల్స్ ఏర్పాటు చేసిన యష్ బిర్లా వంటి కార్పేరేట్ సంస్థలు క్రమంగా ప్రాధమిక విద్యను తమ వశం చేసుకోవాలని చూస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు కూడా అలాగే వున్నాయి. ఇదే జరిగితే పేదవాడికి విద్య అందని ద్రాక్షే.

వెబ్దునియా పై చదవండి