నిరంతరం కొత్త కోర్సులు ప్రవేశపెడుతూ.. విద్యార్థులను ఆకర్షిస్తోన్న ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) తాజాగా ఎస్ఎంఎస్ (సంక్షిప్త సందేశం)ల ద్వారా వివిధ కోర్సుల వివరాలను తెలియజేసేందుకు శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా, విద్యార్థులు సెల్ఫోన్ల ద్వారా ఎస్ఎంఎస్ను పంపిస్తే... వివిధ కోర్సుల సమాచార వివరాలతో పాటుగా, పరీక్షల తేదీలు, ఫలితాలు మొదలైన సమాచారాన్నంతటినీ ఇగ్నో తన ఎస్ఎంఎస్ రిప్లైలో తెలియజేస్తుంది.
ఇదిలా ఉంటే... ఇంకా వారం, పదిరోజుల లోపునే ఈ సేవలను ప్రారంభించనున్నట్లు ఇగ్నో వర్గాలు వెల్లడించాయి. కాగా, దేశంలోనే ప్రథమంగా ఒక విద్యా సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈరకంగా ఉపయోగించుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.
ఇగ్నో కోర్సులు చేసే వారిలో రెగ్యులర్ విద్యార్థులు, ఉద్యోగాలు చేసేవారే ఎక్కువ శాతంమంది ఉన్నారు. అయితే ఇగ్నో ప్రవేశపెట్టబోయే ఈ ఎస్ఎంఎస్ విధానం ద్వారా వివరాలు తెలుసుకునే పద్ధతివల్ల ఇలాంటి వారి సమయం కూడా, చాలా ఆదా అవుతుంది.