దేశంలోని పేదలకు ప్రధాని ఆయుష్మాన్ భారత్... 72వ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రకటన

బుధవారం, 15 ఆగస్టు 2018 (09:43 IST)
భారతదేశ 72వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి ఎర్రకోట నుంచి మాట్లాడారు. దేశ ప్రజల ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా దేశంలోని పేద ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తామన్నారు. తొలి విడత 10 కోట్ల మందికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 

 
కాగా పథకాన్ని సెప్టెంబర్‌ 25న దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పేద కుటుంబాల్లో సంపాందించే వ్యక్తి వ్యాధి బారిన పడితే ఆ కుటుంబం అంతా అల్లకల్లోలం అవుతుందనీ, అలాంటి పరిస్థితి భారతదేశంలోని ఏ పేద కుటుంబానికి తలెత్తకూడదన్నది తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని అన్నారు. ప్రతి పేదవాడు ఆరోగ్యంగా సుఖసంతోషాలతో జీవించాలన్నదే తమ అభిమతమని చెప్పారు.
 
పథకం అమలు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తామనీ, అవసరమైన వైద్య సిబ్బంది, సదుపాయాలు అందుబాటులో ఉంచుతామని అన్నారు. ప్రధానమంత్రి ప్రకటించిన ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల మేరకు ఆరోగ్య బీమా వర్తించనుంది. అలాగే సామాజిక, ఆర్థిక, కుల గణాంకాల డేటా ఆధారంగా లబ్ధిదారుల గుర్తింపు వుంటుందని చెపుతున్నారు. ఈ పథకం ద్వారా వివిధ శస్త్ర చికిత్సలు తక్కువ ధరకే జరిగేట్లు ప్రతి ఆసుపత్రిలోనూ ఒక ‘ఆయుష్మాన్‌ మిత్ర’ను నియమిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు