శశికళ డమ్మీకే అధికారం... పళనిస్వామికి గవర్నర్ పిలుపు!

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (05:13 IST)
అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఎంపికైన ఇకె పళనిస్వామి తమిళనాడు నూతన ముఖ్యమంత్రి కానున్నారా? రాజ్‌భవన్ వర్గాలు తెలిపిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు గురువారం పళనస్వామిచేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పళనిస్వామికి పిలుపు ఇవ్వవచ్చని, వారంలోపు శాసనసభలో మెజారిటీని నిరూపించుకోవలసిందిగా కోరవచ్చని తెలుస్తోంది. 
 
బుధవారం సాయంత్రం పళనిస్వామి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంతో మళ్లీ భేటీ అయిన గవర్నర్ విద్యాసాగరరావు శాసససభ్యుల సంఖ్య ప్రాతిపదికన పళనిస్వామి ప్రకటనను ఆమోదించినట్లు తెలుస్తోంది. పళనిస్వామి తనకు 124 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారని గవర్నర్‌కి జాబితా సమర్పించగా, తనకు 8మంది సభ్యులు మద్దతిస్తున్నారని పన్నీర్ సెల్వం చెప్పారు. దీంతో పళనిస్వామిని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించడం తప్ప గవర్నరుకు మరో దారి లేకుండా పోయిందని రాజభవన్ వర్గాలు తెలిపాయి. 
 
ఈ నిర్ణయానికి రావడానికి ముందు గవర్నర్ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని వచ్చిన పిటిషన్ ను కూడా లెక్కించారు. కాని పళనిస్వామి వద్ద జాబితా చూసిన తర్వాత గవర్నర్ ఈ విషయంపై ఒక తుది నిర్ణయానికి వచ్చేసినట్లు తెలిసింది. 
 
గత పది రోజులుగా తమిళనాడును అతలాకుతలం చేస్తున్న రాజకీయ సంక్షోభానికి గురువారం గవర్నర్ తెర దించనున్నట్లు సమాచారం.
 

వెబ్దునియా పై చదవండి