కోడిగుడ్డు ఉడికించే ముందు కొంచెం నిమ్మరసం రాస్తే...?

శనివారం, 12 జనవరి 2019 (14:30 IST)
వంటింట్లో వంటకు కావలసిన పదార్థాలన్నీ ఉంటాయి. కానీ, కొన్ని పదార్థాలు మాత్రం అప్పుడప్పుడు చెడిపోతుంటాయి. మరి వాటిని భద్రపరచాలంటే.. ఏం చేయాలని ఆలోచిస్తున్నారా.. ఈ వంటింటి చిట్కాలు పాటించండి చాలు..
 
1. ధనియాలు, పసుపు పొడిలో చిటికెడు ఇంగువపొడి కలిపి ఉంచితే పురుగుపట్టదు. కందిపప్పు త్వరగా ఉడకాలంటే.. అందులో కొబ్బరి ముక్కను వేసుకోవాలి. కంద ముక్కలతో పాటు చిటికెడు బెల్లం కూడా వేసి ఉడకబెడితే ముక్కలు త్వరగా ఉడుకుతాయి.
 
2. చారుకు గానీ, పులుసుకు గానీ చింతపండును నానవేసేటప్పుడు చల్లని నీరు కాకుండా, కొంచెం వేడినీళ్ళల్లో నానవేస్తే త్వరగా నాని పులుసు బయటకు వస్తుంది. గుమ్మడి కాయ గింజలను పారవేసే కంటే వాటిని కొంచెం వేయించి ఉప్పు, కారం, పులుసు వేసి.. చట్నీ నూరుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.
 
3. పకోడీలను కలిపిన పిండిని పావుగంట ఊరనిచ్చి కొన్ని వెల్లుల్లి పాయలను నూరి కలిపితే పకోడీలు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. మినపట్ల పిండిలో కప్పు సగ్గుబియ్యం నానబెట్టి, రుబ్బి కలిపితే పిండి ఆటిరావడమే కాకుండా అట్లు చిరిగిపోకుండా పలచగా వస్తాయి.
 
4. కోడిగుడ్డు ఉడికించే ముందు కొంచెం నిమ్మరసం రాస్తే ఉడుకుతుండగా గుడ్డు పగిలి సొన బయటకు రాదు. ఉల్లిపాయలు ఒక్కోసారి మొక్కలు వచ్చేస్తుంటాయి. దబ్బరసం గానీ, ఏదైనా ఊచగానీ కాల్చి మొక్క వచ్చే వైపున ఉల్లిపాయలోనికి గుచ్చితే మొక్కలు రావు.
 
5. రెండు గుప్పిళ్ళు ఎండు మిరపకాయ ముచ్చికలు, ఐదు ఎండు మిరపకాయలు, గరిటెడు మినపప్పు, గరిటెడు శెనగపప్పులను కలిపి కొద్దిగా వేయించి కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు, చిటికెడు ఇంగువ కలిపి దంచుకుంటే టిఫిన్లలోకి కారప్పొడి బాగుంటుంది.
 
6. బత్తాయి పండ్లు నిలువ ఉండి ఆరిపోతే వలిచేటప్పుడు తొక్క సులభంగా ఊడిరాదు. అందుకు ముందుగా మీరు బత్తాయి పండ్లను 5 నిమిషాలు వేడినీటిలో నానబెట్టి వలిస్తే సులభంగా తొక్కలు ఊడిపోతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు