కరోనా వైరస్ వ్యాపించిన వ్యక్తితోనే రెండురోజులు గడిపాడు.. కానీ సోకలేదు, ఎలా?

గురువారం, 26 మార్చి 2020 (23:08 IST)
చిత్తూరు జిల్లాలో మొట్టమొదటి కరోనా వైరస్ కేసు నమోదైంది. లండన్ నుంచి వచ్చిన ఒక యువకుడికి పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు నిర్థారించారు వైద్యులు. ఈ నెల 18వ తేదీన లండన్ నుంచి చెన్నైకు వచ్చాడు శ్రీకాళహస్తికి చెందిన యువకుడు. విమానంలో చెన్నైకు వచ్చి అక్కడి నుంచి తన స్నేహితుడితో కలిసి కారులో శ్రీకాళహస్తికి వచ్చాడు.
 
మొదట్లో లండన్‌లో యువకుడితో పాటు అతని స్నేహితుడి రక్తనమూనాలను తీసుకుని పరీక్షించారు. అయితే ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరిని విమానంలోకి అనుమతించారు. అయితే శ్రీకాళహస్తికి వచ్చిన తరువాత అతనికి దగ్గు ఎక్కువైంది.
 
దీంతో కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకొచ్చారు. రక్తనమూనాలను పరిశీలించిన వైద్యులు అతనికి పాజిటివ్ అని నిర్థారించారు. ఆ యువకుడితో పాటు  రెండురోజులు ట్రావెల్ చేశాడు అతని స్నేహితుడు. అతని దగ్గరే ఉన్నాడు. కానీ అతనికి మాత్రం వైరస్ సోకలేదు.
 
అతనొక్కడే కాదు కుటుంబ సభ్యులతో మరో రెండురోజుల పాటు గడిపాడు ఆ యువకుడు. వారందరి రక్తనమూనాలాను సేకరించి నెగిటివ్ గా తేల్చేశారు వైద్యులు. అయితే ఆ యవకుడు శానిటైజర్స్, మాస్క్ వాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే వైరస్ సోకినట్లు నిర్థారణకు వచ్చారు. 
 
కానీ అతని స్నేహితుడు మాత్రం శానిటైజర్స్‌ను చేతిలో ఉంచుకోవడమే కాకుండా ఎన్.95 లాంటి మాస్క్‌ను వాడటంతో కరోనా వైరస్ సోకలేదని వైద్యులు నిర్థారించారు. అయితే కుటుంబ సభ్యులకు మాత్రం వైరస్ సోకకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు