కోనసీమలో కలకలం రేపుతున్న కోయంబేడు.. ఎందుకో తెలుసా?

గురువారం, 14 మే 2020 (21:01 IST)
పచ్చటి కోనసీమలో చెన్నై కోయంబేడు మార్కెట్ కలకలం రేపుతోంది. దీనికి కారణం కరోనా వైరస్సే. ఈ మార్కెట్‌కు రాకపోకలు సాగించిన అనేక లారీ డ్రైవర్లకు, చిరు వ్యాపారులకు, కొనుగోలుదార్లకు ఈ వైరస్ సోకింది. ఇప్పటికే చెన్నై నగరంలో కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న విషయం తెల్సిందే. ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నమోదవుతున్న కరోనా కేసులకు కేంద్ర బిందువుగా చెన్నై కోయంబేడు మారింది. 
 
ఈ మార్కెట్‌కు వెళ్లొచ్చిన అనేక మంది ఆంధ్రా వ్యాపారులు, పౌరులు ఈ వైరస్ బారినపడటం ఇపుడు అక్కడ కలకలం రేపుతోంది. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ మార్కెట్ కారణంగా కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు దీని ఎఫెక్ట్ జిల్లాలను దాటుకుని తూర్పుగోదావరి జిల్లా కోనసీమను తాకింది. 
 
కోయంబేడు మార్కెట్ కు వెళ్లొచ్చిన పలువురికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అమలాపురంలో రెండు పాజిటివ్ కేసులు తేలాయి. బండారులంకలో ఓ వ్యాన్ డ్రైవర్‌కు పాజిటివ్ అని తేలింది. అంతేకాదు, ఆయన ద్వారా భార్యకు వైరస్ సోకింది.
 
మరోవైపు కొత్తపేట మండలంలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏనుగుల మహల్‌కు చెందిన ఇద్దరికి, బోడిపాలెంకు చెందిన మరొక వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ముగ్గురు ఈ నెల 10న కోయంబేడు నుంచి రావులపాలెం చేరుకున్నారు. 
 
అయితే కరోనా అనుమానం రావడంతో ఇళ్లకు వెళ్లకుండా... కొత్తపేట సమీపంలో ఉన్న ఓ లంకలో తలదాచుకుని, అధికారులకు సమాచారాన్ని అందించారు. అధికారులు వీరికి వైద్య పరీక్షలను నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో, ప్రశాంతంగా ఉన్న కోనసీమలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు