కరోనా రోగుల రికవరీ జాబితాలో కనిపించని తెలుగు రాష్ట్రాలు?

సోమవారం, 13 జులై 2020 (19:56 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. అయితే, సోమవారంతో రికవరీ రేటు 63.02 శాతానికి పెరిగింది. మన దేశ సరాసరి రికవరీ రేటు కంటే 19 రాష్ట్రాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉంది. 
 
రికవరీ రేటు ఎక్కువగా ఉన్న టాప్ 10 జాబితాలో కేంద్రపాలిత ప్రాంతం లఢక్ తొలి స్థానంలో ఉంది. టాప్ టెన్ జాబితాలో ఇరు తెలుగు రాష్ట్రాలు స్థానాన్ని దక్కించుకోలేకపోడం గమనార్హం. అలాగే దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం పేరు కూడా లేదు. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 5,53,470 మంది కరోనా పేషెంట్లు రికవర్ అయ్యారు. గత 24 గంటల్లో 18,850 మంది కోలుకున్నారు.
 
కరోనా రోగులు బాగా కోలుకున్న రాష్ట్రాల జాబితాను పరిశీలిస్తే, లఢక్ - 85.45 శాతం, ఢిల్లీ - 79.98 శాతం, ఉత్తరాఖండ్ - 78.77 శాతం, ఛత్తీస్‌గఢ్ - 77.6 శాతం, హిమాచల్ ప్రదేశ్ - 76.59 శాతం, హర్యాణా - 75.25 శాతం, ఛండీగఢ్ - 74.60 శాతం, రాజస్థాన్ - 74.22 శాతం, మధ్యప్రదేశ్ - 73.03 శాతం, గుజరాత్ - 69.73 శాతం చొప్పున ఉన్నాయి.
 
కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా  3,01,609 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య యాక్టివ్ కేసుల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,19,103 మంది శాంపిల్స్‌ను టెస్ట్ చేశారు. మరోవైపు మరణాల శాతం కూడా తగ్గుముఖం పట్టింది. మరణాల రేటు ప్రస్తుతం 2.64 శాతానికి తగ్గింది. దేశ సరాసరి మరణ రేటు కంటే 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల రేటు తక్కువగా ఉంది. వీటిలో మణిపూర్, నాగాలాండ్, దాద్రా మరియు నగర్ హవేలి, డమన్ మరియు డయూ ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు