భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా వైరస్.. కొత్తగా 25 వేల కేసులు

ఆదివారం, 14 మార్చి 2021 (10:51 IST)
భారత్‌లో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆ కేసుల సంఖ్య 25 వేలు దాటడం మరింతగా కలవరపెడుతోంది. 
 
గడిచిన 24 గంటల్లో 8,64,368 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 25,320 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,59,048కి చేరింది. క్రియాశీల కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. 
 
దేశంలో ప్రస్తుతం 2,10,544 యాక్టివ్‌ కేసులుండగా.. ఆ శాతం 1.85కి పెరిగింది. మరోవైపు నిన్న 16,637 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 1,09,89,897(96.75శాతం)గా ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 161 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 1,58,607కి చేరింది.
 
మరోవైపు, మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. శనివారం ఒక్క రోజే 15,602 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. 88 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. ముంబై, నాగ్‌పూర్‌లలో కేసుల సంఖ్య పెరుగుతోంది.
 
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 50,998 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 228 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,161కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒకరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1653కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 152 మంది కోలుకున్నారు. 
 
ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,97,515కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,993 ఉండగా.. వీరిలో 795 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 46 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 92,00,465కి చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు