ఇంగ్లండ్‌తో తొలి ట్వంటీ-20: టీమిండియా ఘోర పరాజయం

శుక్రవారం, 12 మార్చి 2021 (22:30 IST)
Team India
ఇంగ్లండ్‌తో మొతేరాలో జరిగిన తొలి ట్వంటీ-20లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ విఫలమైంది. లక్ష్యసాధనలో ఇంగ్లండ్ దూకుడుగా ఆడి కేవలం 15 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. మొదటి టీ20లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
 
ఇంగ్లాండ్ టీం లో ఓపెనర్ జాన్సన్ రాయ్ 49 పరుగుల (32 బంతులు, 4ఫోర్లు, 3 సిక్సులు) తో రాణించాడు. 12వ ఓవర్లో వాషింగ్ టన్ సుందర్ బౌలింగ్ ఎల్బీడబ్యూ గా ఔటయ్యాడు. మరో ఓపెనర్ జాస్ బట్లర్ 28 పరుగులు (24 బంతులు, 2ఫోర్లు, 1సిక్స్) చేసి 8వ ఓవర్లో చాహల్ కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మాలన్ 18పరుగుల(19 బంతులు, 2ఫోర్) తో, బెయిర్‌స్టో 25 పరుగుల(16 బంతులు, 1 ఫోర్, 2 సిక్సులు)తో ఇంగ్లాండ్ ను విజయ తీరం చేర్చారు. ఇండియా బౌలర్లలో చాహల్, వాషింగ్ టన్ సందర్ చెరో వికెట్ తీశారు. మిగతా బౌలర్లు వికెట్లు రాబట్టంలో విఫలమయ్యారు.
 
తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేసింది. ఇంగ్లిష్‌ పేసర్ల ధాటికి కోహ్లీసేన విలవిల్లాడింది. శ్రేయస్‌ అయ్యర్‌ (67; 48 బంతుల్లో 8×4, 1×6) మాత్రమే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు. రిషభ్ పంత్‌ (21; 23 బంతుల్లో 2×4, 1×6) కాసేపు బ్యాటింగ్ తో అలరించాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో రివర్స్‌స్వీప్‌తో సిక్సర్‌ బాది అదరగొట్టాడు. 
 
హార్దిక్‌ పాండ్య (19; 21 బంతుల్లో 1×4, 1×6) సైతం కొంత సమయం అయ్యర్‌కు అండగా నిలిచాడు. మిగతా వారు క్రీజ్ లో నిలదొక్కుకునే లోపే పెవిలియన్ చేరి నిరాశపరిచారు. ఇంగ్లాండ్ ఐదుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌ను ప్రయోగించింది. ఆర్చర్‌ 3 వికెట్లు తీశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు