మర్కజ్ ప్రార్థనల వల్ల 9 వేల మందికి కరోనా ప్రమాదం : కేంద్రం హెచ్చరిక

గురువారం, 2 ఏప్రియల్ 2020 (12:55 IST)
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో 9 వేల మంది కరోనా వైరస్ ప్రమాదం అంచున ఉన్నట్టు కేంద్రం తాజాగా పేర్కొంది. ఈ మర్కజ్‌ మీట్‌కు 7600 మంది భారతీయులు, 1300 మంది విదేశీయులు హాజరయ్యారనీ, ఈ వీరికారణంగా 9 వేల మందికి ఈ వైరస్ ప్రమాదం అంచున ఉన్నట్టు పేర్కొంది. దేశంలో అతిపెద్ద కరోనా హాట్ స్పాట్ ఈ ప్రార్థనలు జరిగిన మసీదేనని అభిప్రాయపడ్డ కేంద్రం, వైరస్ సోకిన వారి సంఖ్య 9 వేలకు మించే ఉండవచ్చని పేర్కొంది. 
 
ఈ మత ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చిన వారిని గుర్తించేందుకు 23 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు నిర్వరామంగా పని చేస్తున్నారని కేంద్రం తెలిపింది. ఏప్రిల్ 1 వరకూ 1,051 మందిని క్వారంటైన్ చేయగా, వారిలో 21 మందికి ఇప్పటికే పాజిటివ్ వచ్చింది. ఇద్దరు వ్యక్తులు మరణించారు. 
 
అయితే, మర్కజ్ ప్రార్థనలతో సంబంధమున్న ప్రతి ఒక్కరినీ గుర్తించడం అధికారులకు కష్ట సాధ్యంగా మారిందని పీఎంఓ కార్యాలయ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అత్యధికులను గుర్తించినా, ఇంకా బయటకు రానివారి ద్వారా వ్యాధి ఎంతమందికి వ్యాపిస్తుందన్న అంశం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
 
కాగా, ఇప్పటివరకూ ఈ ప్రార్థనలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధమున్న 400 మందికి పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రార్థనలతో సంబంధమున్న కేసులు తమిళనాడులో అత్యధికంగా 190 ఉండగా, ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏపీలో 71, ఢిల్లీలో 28, తెలంగాణలో 28, ఆసోంలో 14, మహారాష్ట్రలో 12, అండమాన్ లో 10, జమ్మూ కశ్మీర్ లో 6, పుదుచ్చేరి, గుజరాత్‌లో రెండేసి కేసులు పాజిటివ్ వచ్చాయని కేంద్రం తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు