మర్కజ్ భవనం శుద్ధి.... 617 మందిలో కరోనా లక్షణాలు

బుధవారం, 1 ఏప్రియల్ 2020 (19:22 IST)
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భవనంలో ఉన్న ముస్లిం మతపెద్దలను ఖాళీ చేయించి, ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారు. ఈ భవనం నుంచి మొత్తం 2361 మందిని క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో 617 మందికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. 
 
ఈ మర్కజ్ మసీదు వేదికగా ఇటీవల మతపరమైన ప్రార్థనలు జరిగాయి. ఇక్కడు కరోనా బాధిత దేశాల నుంచి అనేక మంది ప్రతినిధులు వచ్చారు. ఈ సదస్సుకు హాజరై తమతమ ప్రాంతాలకు తిరిగివెళ్లిన వారి నుంచే ఈ వైరస్ దేశ వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ఈ మర్కజ్ మసీదును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 
 
పైగా, ఇక్కడ ఉన్న వారందరినీ ఖాళీ చేయించి వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఈ తరలింపు కార్యక్రమం ఏకంగా 36 గంటల పాటు సాగింది. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వారందరికీ మనీష్‌ సిపోడియా కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఇకపోతే, ఢిల్లీలోని మర్కజ్‌ భవన్‌తో పాటు పరిసర ప్రాంతాలను సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది శానిటైజేషన్‌ చేస్తున్నారు. మర్కజ్‌ భవన్‌లో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు జరిగిన మత ప్రార్థనల్లో ఇతర దేశాలకు చెందిన వారితో పాటు మన దేశానికి చెందిన పలువురు ముస్లింలు పాల్గొన్నారు. ఈ ప్రార్థనల్లో సుమారు 3 వేల మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో పెక్కు మందికి ఈ వైరస్ సోకింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు