ఫోన్ స్క్రీన్లు, కరెన్సీ, స్టీల్ వస్తువులపై కరోనా 28 రోజుల పాటు బతికే వుంటుందట..!

సోమవారం, 12 అక్టోబరు 2020 (11:11 IST)
బ్యాంకు నోట్లు, ఫోన్ స్క్రీన్లు, స్టీల్ వస్తువులపై కరోనా వైరస్ 28 రోజుల పాటు బతికి వుంటుందని ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు తాజాగా వెల్లడించారు. SARS-Cov-2 వైరస్ ముందుగా ఊహించిన దాని కన్నా.. ఎక్కువ కాలమే జీవించి ఉంటుందని నేషనల్ సైన్స్ ఏజెన్సీ పరిశోధకులు తేల్చారు. ల్యాబ్‌లో పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. 
 
అయితే అతినీలలోహిత కిరణాల మధ్య వైరస్ ఎక్కువ కాలం జీవించదన్న సంగతి తెలిసిందే. స్టీల్ కానీ, ప్లాస్టిక్ వస్తువులపై వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుందనే అంశంపై చాలా అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి మనుషులు తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా.. వైరస్ వ్యాప్తి చెందుతుంది. గాలిలో ఉండే తుంపర్ల వల్ల కూడా వైరస్ ప్రబలుతుందని కొన్ని సర్వేలు తేల్చిన సంగతి తెలిసిందే.
 
వైరస్ సంక్రమిత స్టీల్‌, ప్లాస్టిక్ పాత్రలను తాకితే కూడా కోవిడ్-19 వచ్చే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) పేర్కొన్నది. బ్యాంకు నోట్లపై SARS-Cov-2 వైరస్ రెండు లేదా మూడు రోజుల పాటు ఉంటుందని, ప్లాస్టిక్‌-స్టీల్‌పై ఆరు రోజుల పాటు వైరస్ సజీవంగా ఉంటుందని తొలుత కొన్ని పరిశోధనలు పేర్కొన్నాయి. 
 
అయితే ఆస్ట్రేలియా ఏజెన్సీ సీఎస్ఐఆర్‌వో తాజాగా తన నివేదికలో కొత్త విషయాన్ని వెల్లడించింది. అత్యంత స్మూత్ సర్ఫేస్‌లపై వైరస్ సుమారు 28 రోజుల పాటు సజీవంగా ఉంటుందని ఆస్ట్రేలియన్ ఏజెన్సీ పేర్కొంది. మొబైల్ ఫోన్ స్క్రీన్లు, ప్లాస్టిక్‌, బ్యాంకు నోట్లపై 20 సెంటీగ్రేడ్ల వద్ద వైరస్ 28 రోజుల పాటు బ్రతికి ఉంటుందని సీఎస్ఐఆర్వో వెల్లడించింది. ఫ్లూ వైరస్ మాత్రం 17 రోజుల పాటు స్టీల్‌, ప్లాస్టిక్‌పై సజీవంగా ఉంటుందని పరిశోధకులు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు