కరోనా వైరస్... సానియా మీర్జా ఏం చెప్పారంటే?

గురువారం, 5 మార్చి 2020 (11:06 IST)
చైనాలో వూహాన్ కేంద్రంగా పుట్టుకొచ్చి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. ఇపుడు దేశ ప్రజలను కూడా వణికిస్తోంది. బుధవారం ఒక్క రోజే ఏకంగా 28 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు.. ఢిల్లీలో అనేక అనుమానిత కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశ ప్రజలంతా వణికిపోతున్నారు. 
 
ఈ క్రమంలో పలువురు ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌, వైద్యులతో పాటు.. సెలెబ్రిటీలు కరోనా వైరస్ గురించి తమతమ స్పందనలు తెలియజేస్తున్నారు. ఇలాంటివారిలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఉన్నారు. చైనా దేశంలోని వూహాన్ నగరంలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న తరుణంలో మన దేశ ప్రజలు దీనిపై అవగాహన పెంచుకొని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 
 
సానియా మీర్జా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియో విడుదల చేశారు. కరోనా వైరస్ లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలని సానియా మీర్జా విడుదల చేసిన వీడియోలో కోరారు.
 
కరోనా వైరస్‌పై సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబరు 104కు కాల్ చేయాలని, ఈ వైరస్ సోకకుండా ముందుజాగ్రత్తగా నిత్యం చేతులు శుభ్రంగా కడుక్కోవాలని కోరారు. కరోనా వైరస్ లక్షణాలుంటే 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో చేరి చికిత్స పొందాలని సానియా సలహా ఇచ్చారు. 
 
దేశంలో ఇప్పటివరకు 28 మంది కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 90 వేల మందికి పైగా కరోనా వైరస్ సోకగా మృతుల సంఖ్య మూడు వేలు దాటింది. ఇప్పటికే 65 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు