చెన్నై తరమణి ఆఫీసులో 40మందికి కరోనా పాజిటివ్

సోమవారం, 22 మార్చి 2021 (15:04 IST)
తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసే కొందరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీందో ఉద్యోగులు షాకవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై, తరమణి, పెరుంగుడి, కందన్చావడి ప్రాంతాల్లో బ్రాంచ్ ఆఫీసులను కలిగివున్న ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన 40 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ కంపెనీలో పనిచేసిన ఉద్యోగులంతా కరోనా టెస్టుకు సిద్ధమవుతున్నారు. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఎన్నికల నేపథ్యంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. 
 
కరోనా మొదటి దశ కన్నా.. రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,951 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేవలం మహారాష్ట్రలోనే 30,535 కేసులు నమోదవ్వగా, పంజాబ్‌లో 2,644 కేసులు నమోదయ్యాయి. కరోనాబారిన పడి మరణించిన వారి సంఖ్య 200కు పైగా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 3.34 లక్షలకు పైగా ఉన్నాయి.
 
ప్రస్తుతం మహారాష్ట్రలో కేసుల సంఖ్య 24,79,682కు చేరింది. ఆ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 99 మంది కరోనాతో మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 53,399కు చేరింది. పూనెలో కొత్తగా 5,421 కేసులు నమోదయ్యాయి. ముంబైలో 3,775 కొత్త కోవిడ్‌ కేసులు నమోదవ్వగా, ముంబై సిటీలో మొత్తం 3.62 లక్షల కేసులు ఉండగా, అందులో యాక్టివ్‌ కేసులు 23,448గా ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు