ఆ వృద్ధురాలు కరోనాను జయించింది, బాధ్యతను పెంచింది: గంధం చంద్రుడు

బుధవారం, 22 ఏప్రియల్ 2020 (15:17 IST)
కరోనా మహమ్మారి మానవ జీవితాలకు అనుకోని ముగింపు పలుకుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి పట్ల అదే కర్కశత్వం. కాని అనంతపురం జిల్లాలో ఇందుకు భిన్నంగా 85 సంవత్సరాల వృద్ధురాలు కరోనాను జయించింది. జిల్లా యంత్రాంగం చేసిన అవిరళ కృషి ఆ అవ్వకు భూమిపై నూకలు మిగిల్చాయి. 
 
అనంతపురం జిల్లా హిందుపూర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఒక వయోవృద్ధురాలు (85) క్వారెంటైన్ నుండి ఆరోగ్యంగా బయటకు వచ్చారు. ప్రపంచ జనాభాను కరోనా వణికిస్తుండగా, ఈ వృద్ధురాలు మాత్రం సంపూర్ణ ఆయుష్షుతో పునర్జన్మను పొందారు. అయితే ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే వృద్ధురాలు కరోనాను జయించగలిగినా, ఆమె కుమారుడు (60) మాత్రం ఈ విపత్తు నుండి బయటపడలేక పోయారు.
 
ఏప్రిల్ నాలుగున ఇతను కరోనాతో మృతి చెందగా, ఇంటిల్లిపాదికి పరీక్షలు నిర్వహించటమే కాక, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు స్వయం పర్యవేక్షణలో అందరినీ క్వారెంటైన్ కోసం సంస్థాగతమైన సదుపాయాలు కలిగిన వైద్యశాలకు పంపారు. నేటి కరోనా విజేత మాత్రం వయోభారం ఫలితంగా ఇంటిలోనే స్వయం నియంత్రణలో ఉంది. అయితే కరోనా పరీక్షలలో ఆమెతో సహా మనవడికి సైతం కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ వయోవృద్ధురాలని సైతం సంస్ధాగత క్వారంటైన్‌కు పంపారు. 
 
అనంతరం మంగళవారం ఆమెకు తుది విడత పరీక్షలు నిర్వహించగా వృద్ధురాలు కరోనా నుండి బయట పడినట్లు నిర్దారణ అయ్యింది. ఈ నేపధ్యంలో జిల్లా పాలనాధికారి గంధం చంద్రుడు మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చేసిన కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఆ వృద్ధురాలు కరోనా నుండి బయటపడటం తమపై మరింత బాధ్యతను పెంచిందని, క్వారెంటైన్లో ఉన్న వారందరినీ సజీవులుగా బయటకు తీసుకురాగలగటమే తమ ముందున్న లక్ష్యమని గంధం చంద్రుడు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు