కరోనా రోగుల ముంగిట మరో ముప్పు... ఏంటది?

సోమవారం, 24 మే 2021 (11:00 IST)
దేశ ప్రజలను వివిధ రకాలైన వ్యాధులు భయఫ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే కరోనా కోరల్లో చిక్కుకుని అనేక మంది ప్రాణాలు విడిస్తున్నారు. దీంతో బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఈ క్రమంలో తాజాగా కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారికి మరో ముప్పు పొంచివుంది. ఇపుడు కొత్తగా ‘గ్యాంగ్రిన్‌’ రూపంలో మరో గండం ఎదురవుతోంది. 
 
‘బ్లాక్‌ ఫంగస్‌’ సోకితే.. కంటి చూపును కోల్పోయే ముప్పుతో పాటు మొత్తం దవడనే తీసేయాల్సి రావచ్చు. ‘గ్యాంగ్రిన్‌’ చుట్టుముడితే.. అది వ్యాపించిన కాళ్లు, చేతులను తొలగించాల్సి వస్తుంది. ఈ సమస్యతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య మార్చి నుంచే క్రమంగా పెరుగుతోందని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన వాస్క్యులర్‌ సర్జన్‌ డాక్టర్‌ మనీశ్‌ రావల్‌ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. 
 
గ్యాంగ్రిన్‌ బాధితుల్లో ఎక్కువ మంది కొవిడ్‌ నుంచి కోలుకున్న వారేనన్నారు. ఈ ఆరోగ్య సమస్యకు ప్రధాన కారణం ‘త్రాంబోసిస్‌’ అని ఆయన తెలిపారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న కొందరిలో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు క్షీణించి త్రాంబోసిస్‌కు దారితీస్తోందన్నారు. ఫలితంగా బాధితుల రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతోందని తెలిపారు. ధమనులు గుండె నుంచి వివిధ శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్తాయి.
 
‘‘ఉదాహరణకు కాలిలోని ఒక ధమని త్రాంబోసిస్‌తో ప్రభావితమైతే.. మొత్తం కాలు బరువుగా, మొద్దుబారినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత కాలు పూర్తిగా చల్లబడిపోతుంది. కాలు తొలుత నీలిరంగుకు, తర్వాత ఎరుపు రంగులోకి మారిపోతుంది. ఈ స్థితినే గ్యాంగ్రిన్‌ అంటారు. దీని లక్షణాలను గుర్తించిన గంట నుంచి ఆరు గంటల్లోగా చికిత్స చేయించుకోవాలి. లేదంటే ఆ కాలును తీసేయాల్సి రావచ్చు’’ అని ఓ డాక్టర్‌ వివరించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు