యువకులూ తస్మాత్ జాగ్రత్త : కరోనా బాధితుల్లో వారే అధికం..

ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (09:28 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటికే 18 రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాపించింది. ఈ వైరస్ బారినపడిన వారిలో అత్యధికంగా యువకులే ఉన్నారు. అయితే, దేశంలో ఇప్పటివరకు చనిపోయిన కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులు ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్రం తాజాగా వెల్లడించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 
 
దేశవ్యాప్తంగా మూడువేలకు పైగా కరోనా నిర్ధారిత కేసులు నమోదు కాగా, వారిలో 83 శాతం మంది 60 ఏళ్లలోపు వారే. అందులో 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారి సంఖ్యే ఎక్కువ. 60 ఏళ్లు అంతకుమించి వయసు కలిగిన వారు కేవలం 17 శాతం మందే ఈ వైరస్ బారినపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
 
మరోవైపు, విదేశాల నుంచి వచ్చిన యువకుల్లో ఎక్కువమందికి ఈ వైరస్ సోకింది. వీరంతా చదువు, ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లినవారే. వీరిలోనూ 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారి సంఖ్యే ఎక్కువ. వైరస్ బారినపడిన వారిలో ఈ వయసు వారే ఎక్కువని కేంద్రం ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మొత్తంగా చూస్తే బాధితుల్లో తక్కువగా ఉన్న వృద్ధుల సంఖ్య.. మరణాల్లో మాత్రం ఎక్కువగా ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు