దియా లైట్ : కేవలం విద్యుత్ లైట్లనే ఆర్పాలి...

ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (09:01 IST)
కంటికి కనిపించని శత్రువును పారదోలడానికి, కరోనా అనే చీకటిని జయించడానికి దీపం ప్రజ్వలన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు దేశ వ్యాప్తంగా జరుగనుంది. ఈ పిలుపును దేశ ప్రజలంతా పాటించాలని దేశ ప్రధానిగా మోడీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే.. రాత్రి 9 గంటల 9 నిమిషాలకు ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లలోని విద్యుత్ దీపాలను మాత్రమే ఆర్పివేసి, క్యాండిల్స్ లేదా నెయ్యి దీపాలు, కిరోసిన్ దీపాలు, టార్చిలైట్లు, మొబైల్ ఫ్లాష్ లైట్లు ఇలా ఏవైనా సరే వెలిగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. 
 
అయితే, ప్రధాని పిలుపు నేపథ్యంలో ఆదివారం రాత్రి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది. వాటిని వెలిగించే ముందు.. చేతులను సబ్బుతో కడుక్కోవాలని, శానిటైజర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడొద్దని హెచ్చరించింది. శానిటైజర్లలో ఆల్కహాల్‌ ఉన్న కారణంగా, దానికి మండే స్వభావం ఉన్న నేపథ్యంలో ఈ హెచ్చరిక చేసింది. ఆర్మీ సైతం ఇదే తరహా సూచనలు చేసింది. 
 
మరోవైపు, ఈ దీప ప్రజ్వలన సమయంలో కేవలం విద్యుత్ దీపాలను మాత్రమే ఆర్పివేయాలని విద్యుత్ రంగ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఏసీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రం యధావిధిగా ఆన్‌లో ఉంచాలని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు