కివీస్ పర్యటనలో శుభారంభం.. అదరగొట్టిన విరాట్ కోహ్లీ సేన.. ఆరు వికెట్ల తేడాతో గెలుపు

శుక్రవారం, 24 జనవరి 2020 (17:35 IST)
టీమిండియా కివీస్ పర్యటనను శుభారంభం చేసింది. తొలి టీ-20లో విజయాన్ని నమోదు చేసుకుంది. ఐదు ట్వంటీ-20ల సిరీస్‌లో భాగంగా ఈడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా జట్టు న్యూజిలాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ సేన సునాయాసంగా లక్ష్యాన్ని అధిగమించింది. 
 
ఈ క్రమంలో ఇన్నింగ్స్ ప్రారంభంలో ఓపెనర్ రోహిత్ శర్మ(7) పరుగులకే ఔట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చి కోహ్లీ (45), కేఎల్ రాహుల్ (56) సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా గెలుపు దాదాపు ఖాయమైంది. ఆపై కోహ్లీ, రాహుల్ ఔట్ అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ రాణించడంతో గెలుపు సులభమైంది. అంతకుముందు.. కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల పతనానికి 203 పరుగులు సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియాకు బౌలర్లు సహకరించారు. టీమిండియా బౌలర్లలో బూమ్రా, శార్దూల్ ఠాకూర్, జడేజా, చాహల్, శివమ్ దూబేలకు తలో వికెట్ దక్కింది.
 
టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టుకు ఓపెనర్లు 80 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 19 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లతో 30 పరుగులు చేశాడు. ఓపెనర్ మున్రో మాత్రం 42 బంతుల్లో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 59 పరుగులు చేసి కివీస్‌ జట్టు స్కోర్‌లో తనదైన పాత్ర పోషించాడు. ఆ తర్వాత కెప్టెన్ విలియమ్‌సన్ కూడా 26 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 51 పరుగులు సాధించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు