క్రీడా రంగంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో... ఎవరతను?

ఆదివారం, 24 డిశెంబరు 2023 (15:22 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ వారసుడిగా రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత తన ప్రతిభతో గ్లోబల్ స్టార్‌గా పేరు గడించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త అవతారమెత్తారు. ఆయన ఇపుడు క్రీడా రంగంలోకి అడుగుపెట్టారు. గల్లీ క్రికెట్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడం కోసం కొత్త వెంచర్‌ను ప్రారంభించారు. ఇందుకోసం ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ హైదరాబాద్ టీమ్‌ను స్థాపించి, యజమానిగా మారారు. ఈ విషయాన్ని ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 
 
'ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ హైదరాబాద్ టీమ్‌కు యజమానిగా మారినందుకు సంతోషంగా ఉంది. ప్రతిభ, సమాజంలో స్ఫూర్తిని పెంపొందించడం, గల్లీ క్రికెట్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా' అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. అలాగే, హైదరాబాద్ జట్టులో భాగం కావాలని భావించే ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోవాలంటూ రామ్ చరణ్ ఓ లింక్‌‌ను కూడా షేర్ చేశారు. 
 
కాగా, ముంబై జట్టుకు అమితాబ్ బచ్చన్, బెంగళూరు జట్టుకు హృతిక్ రోషన్, జమ్మూకాశ్మీర్ టీంకు అక్షయ్ కుమార్ యజమానులుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు ఐఎస్‌పీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. వర్ధమాన క్రికెట్ ఆటగాళ్లకు గుర్తింపు కల్పించేందుకు, కొత్త టాలెంట్‌ను వెలికి తీసేందుకు ఈ టోర్నీ ఉపయోగపడుతుందని భారత మాజీ సెలెక్టర్, ఐఎస్ పీఎల్ సెలక్షన్ కమిటీ హెడ్ జతిన్ పరాంజపే అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు