ఇందిరా క్యాంటీన్లలో రూ.10కే భోజనం.. ఎక్కడ?

ఆదివారం, 24 డిశెంబరు 2023 (13:31 IST)
కర్నాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగుళూరులోని విమానాశ్రయంలో రెండు ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేసి కేవలం పది రూపాయలకే భోజనం అందివ్వాలని నిర్ణయించింది. అలాగే అల్పాహారాన్ని రూ.5కే విక్రయించనున్నారు. ఈ క్యాంటీన్లను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇందిరా క్యాంటీన్ పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించాలని ఆ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఆ వెంటనే ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. విమానాశ్రయంలోని ఖరీదైన ఫుడ్ ఔట్‌లెట్లలో కూడా సామాన్యులు, మధ్యతరగతి ప్రయాణికులకు కూడా ఆహారం అందించాలన్న ఏకైక లక్ష్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్టు ప్రభుత్వం వెల్లడించింది. 
 
కాగా, బెంగుళూరు నగర వ్యాప్తంగా దాదాపు 175 ఇందిరా క్యాంటీన్లు ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇందిరా క్యాంటీన్లలో కేవలం రూ.5కే అల్పాహారం, రూ.10కే మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. వాస్తవానికి విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల రేట్లు ఆకాశాన్ని తాకుతుంటాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు వీటిని కొనుగోలు చేయాలంటేనే వణికిపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమాన ప్రయాణికులు స్వాగతిస్తున్నారు. 
 
మరోవైపు, దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగుళూరు నగరంలో జీవన వ్యయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అయితే, కప్పు టీ లేదా కాఫీ ధర రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుంది. ఇక భోజనం చేయాలంటే మాత్రం రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చు చేయాల్సిందే. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇందిరా క్యాంటీన్లు సామాన్యులు, మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగించనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు