చాంపియన్స్ ట్రోఫీ : భారత్‌కు చావో రేవో.. గెలిస్తేనే సెమీస్‌కు.. మ్యాచ్ రద్దు అయితే?

ఆదివారం, 11 జూన్ 2017 (10:30 IST)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య అత్యంత కీలక మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్ష భయం పట్టుకుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ ప్రాంతమంతా మబ్బులు పట్టి ఉండగా, శనివారం కూడా ఇక్కడ భారీ వర్షం కురిసింది. దీంతో ఆదివారం జరిగే మ్యాచ్ వర్షార్పణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే విరాట్ కోహ్లీ సేన సెమీస్‌కు చేరుకుంది. 
 
అలాకాకుండా మ్యాచ్ జరిగి సఫారీల చేతిలో ఓడిపోతే మాత్రం ఇంటికి బయలుదేరాల్సి ఉంటుంది. దీనికి కారణం గ్రూప్ - బిలోని అన్ని జట్లూ తలా రెండు పాయింట్లతో ఉండగా, భారత్ మిగతా జట్లతో పోలిస్తే మెరుగైన రన్ రేటుతో మొదటి స్థానంలో ఉంది. మ్యాచ్ రద్దయితే దక్షిణాఫ్రికా, భారత్‌లకు చెరో పాయింట్ వస్తుంది.
 
అదే జరిగితే, 1.272 నెట్‌రన్ రేటుతో ఉన్న భారత్ మరో గణాంకం చూడకుండా సెమీస్‌కు వెళుతుంది. గ్రూప్ -బీలోని చివరి మ్యాచ్ సోమవారం శ్రీలంక, పాకిస్థాన్ మధ్య జరగనుండగా, ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ సోమవారం జరిగే మ్యాచ్ కూడా రద్దయితే, దక్షిణాఫ్రికా సెమీస్‌కు వస్తుంది.

వెబ్దునియా పై చదవండి