లంక చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. డిఫెండింగ్ చాంపియన్ ఇక ఇంటికేనా?

గురువారం, 26 అక్టోబరు 2023 (22:23 IST)
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, గురువారం ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మరోమారు అత్యంత చెత్త ప్రదర్శనతో చిత్తుగా ఓడిపోయింది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 33.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ లక్ష్యాన్ని శ్రీలంక జట్టు కేవలం 25.4 ఓవర్లలో రెండు వికెట్లను కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 77, సదీర సమర విక్రమ 65 చొప్పున పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. నిజానికి శ్రీలంక ఓ దశంలో 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ, నిస్సాంక, సమర విక్రమలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును విజయతీరానికి చేర్చారు. 
 
ఈ ఓటమితో ఇంగ్లండ్ జట్టుకు సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్, ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి ఒకే మ్యాచ్‌లో మాత్రమే నెగ్గింది. అది కూడా బంగ్లాదేశ్‌పై. న్యూజిలాంజ్, ఆప్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక చేతుల్లో ఓటమి పాలైంది. ఇక ఆ జట్టు మరో నాలుగు మ్యాచ్‌లలో ఆడాల్సి వుంది. ఈ నాలుగింటిలో వరుసగా గెలిస్తే ఇంగ్లండ్ సెమీస్‌కు వచ్చే అవకాశాలున్నాయి.
 
అయితే, ఆ నాలుగు మ్యాచ్ ల్లో  ఇంగ్లండ్ విజయం సాధించడం అంత సులువు కాదు. భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్లతో ఆ జట్టు తలపడాల్సి ఉండటమే ఇందుకు కారణం. ఇంగ్లండ్ తన తర్వాతి మ్యాచ్‌లో భారత జట్టుతో లక్నో వేదికగా తలపడుతుంది. వరుస విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేనపై పైచేయి సాధించాలంటే ఇంగ్లండ్ శక్తికి మించి కృషి చేయాల్సిందే. 
 
మరోవైపు, మొదటి రెండు మ్యాచ్‌లో ఓడిన ఆస్ట్రేలియా.. తర్వాత మూడు మ్యాచ్ నెగ్గి సెమీస్ రేసులో ముందుకొచ్చింది. నెదర్లాండ్స్ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సౌతాఫ్రికాను డచ్ జట్టు ఎలా చిత్తుగా ఓడించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాకిస్థాన్ కూడా తనదైన రోజు ఎంత పెద్ద జట్టునైనా ఓడించగలదు. ఈ సవాళ్లను అధిగమించి ఇంగ్లండ్ సెమీస్‌కు వస్తే అది అద్భుతమే అవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు