రోజుకు 8 కేజీల మటన్ ఆరగిస్తే.. ఫలితాలు ఇలానే ఉంటాయి : వసీం అక్రమ్

మంగళవారం, 24 అక్టోబరు 2023 (15:45 IST)
భారత్‌‍లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీ పోటీల్లో భాగంగా, సోమవారం క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ జట్టు చేతిలో పాకిస్థాన్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని పాక్ మాజీ క్రికెటర్లు, ఆ దేశ క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. రోజుకు ఎనిమిది కేజీల మటన్ ఆరగిస్తే ఫలితాలు ఇలానే ఉంటాయంటూ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ మండిపడ్డారు. 
 
ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ వంటి పసికూన చేతిలో.. అదీ 8 వికెట్ల తేడాతో ఓడిపోవడం పాకిస్థాన్‌కు ఘోర పరాభవమనే చెప్పాలి. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్.. అన్ని విభాగాల్లో పాక్ క్రీడాకారులు నిరాశపరిచారు. పాక్ క్రీడాకారుల్లో కనీస ఫిట్నెస్ స్థాయులు కూడా లేకపోవడం అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఈ క్రమంలో పాక్ మాజీ క్రీడాకారుడు వసీం అక్రం చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
 
'ఇది నిజంగా తలవంపులే, జస్ట్ రెండు వికెట్లు.. 280 - 290 స్కోరు.. పెద్దదేమీ కాదు. పిచ్ సంగతి పక్కన పెడితే ఓసారి పాక్ ఫీల్డింగ్ చూస్తే వీళ్ల ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలిసిపోతుంది. క్రీడాకారుల్లో రెండేళ్లుగా ఫిట్నెస్ తగ్గిందని మ్యాచ్ సందర్భంగా మేము పలుమార్లు చర్చించుకున్నాం. ఇక్కడ క్రీడాకారుల పేర్లు ప్రస్తావిస్తే వారికి నచ్చదు. కానీ వీళ్లు రోజుకు 8 కేజీల చొప్పున మటన్ తింటున్నట్టు ఉంది. వాళ్లు దేశం తరపున బరిలోకి దిగారు. ఇందుకోసం పారితోషికం కూడా తీసుకుంటున్నారు. అలాంటప్పుడు కాస్తంత ప్రొఫెషనల్‌గా ఉండాలి' అని సూచించారు. 
 
'ఇలాంటి విషయాల్లో మిస్బా కచ్చితంగా ఉండేవాడు. క్రీడాకారులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేవాడు. ఇది వారికి నచ్చేది కాదు కానీ జట్టు పరంగా అద్భుతాలు సృష్టించింది. ప్రస్తుతం ఏ స్థితికి చేరుకున్నామంటే విజయం కోసం దేవుణ్ణి ప్రార్థించాల్సి వస్తోంది. అది జరిగితే బాగుండును.. ఇది జరిగితే బాగుండును.. మరో టీం ఓటమి చెందితే సెమీస్కు చేరొచ్చంటూ మాట్లాడుతున్నాం. ఫీల్డింగ్ అంటే ఫిట్నెస్‌తో ముడిపడింది. మైదానంలో ఇది స్పష్టంగా తెలిసిపోతుంది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు